ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌కు ఇటు భారత్, అటు బలూచిస్తాన్ దెబ్బ మీద దెబ్బ

international |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 08:52 PM

చేసిన తప్పులకు పాకిస్తాన్ అంతకంతకూ అనుభవిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి.. దాన్ని భారత్‌పైకి ఉసిగొల్పుతూ ఉన్న పాక్.. అదే ఉగ్రవాదుల కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోంది. పాక్ ఉగ్రవాద దాడులను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్‌.. పాక్‌కు గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే పుల్వామా ఉగ్రదాడి తర్వాత.. పాక్‌తో సంబంధాలు తెగదెంపులు చేసుకోగా.. తాజాగా పహల్గామ్ బైసరన్ లోయలో చేసిన దాడి.. మరింత తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయింది. ఇప్పటికే దౌత్య పరంగా, ఆర్థిక పరంగా పాక్‌ను దెబ్బకొట్టిన భారత్.. ఏ క్షణమైనా పాక్‌పై దాడి చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాక్ భయం భయంగా బతుకుతోంది. ఇలాంటి తరుణంలో అటు ప్రత్యేక బలూచిస్తాన్‌ కోసం ఆ ప్రాంతంలో జరుగుతున్న వేర్పాటువాద దాడులు తీవ్రం అవుతున్నాయి.


ప్రత్యేక బలూచిస్తాన్ దేశం ఏర్పాటు కోసం ఇప్పటికే పాక్ ప్రభుత్వంపై, సైన్యంపై పోరాటం చేసేందుకు బలూచిస్తాన్ ప్రాంతంలో బాంబు దాడులు, పేలుళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బలూచిస్తాన్‌లో శుక్రవారం పాక్ భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనానికి సమీపంలో భారీ బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు పాకిస్తానీ సైనికులు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీస్ చీఫ్ నవీద్ అహ్మద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దాడి బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో జరిగినట్లు తెలిపారు. అయితే ఈ బాంబు దాడి చేసింది తామే అని ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత వహించనప్పటికీ.. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పాక్ భద్రతా దళాలను తరచుగా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు భావిస్తున్న బలూచ్ వేర్పాటువాదులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇక ఈ బాంబు దాడి గురించి.. పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వి స్పందించారు. దేశంలో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రాణాలు అర్పించిన భద్రతా దళాలపై జరిగిన దాడిని ఖండిస్తూ.. వారికి నివాళులర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ దాడి కంటే ఒక రోజు ముందు కలాత్ జిల్లాలో రోడ్డు పక్కన బాంబు పేలి ఒక వాహనంలోని ముగ్గురు వ్యక్తులు మరణించారు. అంతకుముందు బుధవారం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పోలియో టీకాలు వేసే మెడికల్ టీమ్‌కు రక్షణగా ఉన్న ఇద్దరు భద్రతా సిబ్బందిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మస్తుంగ్ జిల్లాలోని టెరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. పోలియో టీకా టీమ్‌ను రక్షిస్తున్న లెవీస్ సిబ్బందిపై ముసుగు ధరించిన సాయుధులు దాడి చేశారని అసిస్టెంట్ కమిషనర్ అక్రమ్ హరిఫాల్ మీడియాకు తెలిపారు.


అయితే పాకిస్తాన్‌లో పోలియో టీకా వేసేవారిని తరచుగా లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు దాడులు చేస్తూ ఉంటారు. పోలియో టీకా వేసేవారిని ఇస్లాం వ్యతిరేకులు అని.. ఇది షరియాకు విరుద్ధమని వారు పేర్కొంటారు. పోలియో టీకా టీమ్‌పై జరిగిన దాడిని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారని పాక్ రేడియో నివేదించింది. మూడు రోజుల్లో మూడు ఘటనలు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com