ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పవిత్ర కైలాస్ మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది పునఃప్రారంభం కానుంది. 2025 జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య ఈ యాత్రను నిర్వహించనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేడు అధికారికంగా ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, ఆ తర్వాత చైనా వైపు నుంచి యాత్ర ఏర్పాట్లకు అనుమతి లభించకపోవడంతో 2020 నుంచి ఈ యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే.ఈ ఏడాది యాత్ర కోసం రెండు మార్గాలను ఖరారు చేశారు. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ మీదుగా 50 మంది యాత్రికులతో కూడిన 5 బ్యాచ్లు, సిక్కింలోని నాథూ లా పాస్ మీదుగా 50 మంది యాత్రికులతో కూడిన 10 బ్యాచ్లు ప్రయాణిస్తాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు దరఖాస్తు చేసుకోవడానికి kmy.gov.in అనే అధికారిక వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కంప్యూటర్ ద్వారా పారదర్శకంగా, లింగ సమానత్వ ప్రాతిపదికన యాత్రికులను ఎంపిక చేస్తారు. 2015 నుంచి దరఖాస్తుల స్వీకరణ నుంచి యాత్రికుల ఎంపిక వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా కంప్యూటరీకరించారు.గత అక్టోబరులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు ఇరు దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి భారత్, చైనాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా యాత్ర పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది.
![]() |
![]() |