కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నేర్చుకున్న కీలక పాఠాలను పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మాటలు వినడం కంటే మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చానని, కానీ యాత్ర సమయంలో అసలైన 'వినడం' అంటే ఏమిటో నేర్చుకున్నానని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్రలో ప్రజలతో మమేకమైనప్పుడు, వారి సమస్యలను, భావాలను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశానని తెలిపారు.యాత్ర ప్రారంభంలో తన మనసులో సంభాషణలు కొనసాగుతూ ఉండేవని, కానీ క్రమేణా పూర్తిగా నిశ్శబ్దంగా మారి ఎదుటివారు చెప్పేది మాత్రమే వినడం అలవాటైందని రాహుల్ వివరించారు. ఈ క్రమంలో ఒక మహిళ తనను కలిసి, తన భర్త తనను కొడుతున్నాడని, ఆ విషయం తాను తెలుసుకోవాలన్నదే ఆమె ఉద్దేశమని చెప్పిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆమె బాధను విన్న తర్వాత, ఆమెలో భయం పోయి ప్రశాంతత కనిపించిందని, కేవలం వినడం ద్వారానే ఎంతో మార్పు తీసుకురావచ్చని గ్రహించానని అన్నారు. ప్రజలు చెప్పేది వినడం అనేది ఎంతో ముఖ్యమని, తాము తీసుకోగల చర్యల కన్నా ఇది శక్తివంతమైనదని తాను భావిస్తున్నట్లు తెలిపారు.ప్రతిపక్షాలు ప్రజల మాటలను వినడానికి సిద్ధంగా లేవని, వారికి అన్ని సమాధానాలు ముందే తెలుసని భావిస్తారని రాహుల్ విమర్శించారు. ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలు ఎన్ని ఉన్నా, రాజకీయ నాయకులుగా ప్రజల గొంతును లోతుగా వినడంలో విఫలమవుతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఖాళీని తాము భర్తీ చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతేకాకుండా, 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ప్రజల పట్ల 'ప్రేమ', 'ఆప్యాయత' వంటి పదాలను తాను ఎప్పుడూ బహిరంగంగా వ్యక్తం చేయలేదని రాహుల్ అంగీకరించారు. యాత్రలో ఈ పదాలను ఉపయోగించడం ప్రారంభించాక, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, వారు కూడా తన పట్ల ప్రేమను వ్యక్తం చేయడం మొదలుపెట్టారని అన్నారు. విధానాలు, భవిష్యత్తు ప్రణాళికల ద్వారా కాకుండా, ప్రేమ, ఆప్యాయతల ద్వారా ప్రజలతో నేరుగా, తక్షణమే కనెక్ట్ అవ్వడం సాధ్యమని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. 'ద్వేషం బజారులో ప్రేమ దుకాణం' నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కీ దుకాన్ అనే నినాదం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదేనని, ఎంత ద్వేషం ప్రచారం చేసినా, దానికి ప్రేమ, ఆప్యాయతలతోనే అత్యంత శక్తివంతంగా బదులివ్వగలమని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్పు తన రాజకీయాలను, ప్రజలతో తన సంబంధాన్ని సులభతరం చేసిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
![]() |
![]() |