ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జస్ట్ మిస్.. ఎడ్జ్‌లో ఆగిపోయింది

Crime |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 10:58 PM

జస్ట్ మిస్.. వెంట్రుకవాసిలో ఘోర ప్రమాదమే తప్పింది. చావు అంచుల వరకు వెళ్లి.. ఎవరో తాడేసి పైకి లాగినట్టు.. ఏమీ కాకుండా తిరిగి రావటమంటే ఇదేనేమో. భూమ్మీద నూకలు మిగేలే ఉన్నాయనాలో.. లేచిన ఘడియ బాగుందనాలో.. కారు ఎడ్జ్‌లో ఆగిపోయింది కాబట్టి ఏం కాలేదు.. లేకుంటేనా అంతెత్తు ఉన్న ఫ్లైఓవర్ నుంచి కింద పడితే.. ఇంకేమైనా ఉందా.. కారు మొత్తం తుక్కుతుక్కు అయ్యేది. కారు గురించి పక్కన పెట్టండి.. అందులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏంటీ..? అక్కడితో అయిపోయిందా.. అదే సమయంలో ఫ్లైఓవర్ కింద రోడ్డుపై ప్రశాంతంగా వెళ్తున్న వాహనాలపై గనక ఆ కారు పడి ఉంటే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉండేది..? ఆ బీతావహ దృశ్యాలు ఊహించుకుంటేనే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది. జస్ట్ ఎడ్జ్‌లో కారు ఆగిపోయింది కాబట్టి ఎలాంటి ఘోరం జరగలేదు. ఈ ప్రమాదం ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే మీద జరిగింది.


సాదారణంగానే పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీద వాహనాలు మాంచి స్పీడ్‌తో దూసుకెళ్తుంటాయి. అలాగే ఓ కారు అతివేగంతో దూసుకెళ్తోంది. దాని దారిలో అది వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. ఓవర్ స్పీడ్‌తో దూసుకొచ్చిన ఆ కారు.. ముందువెళ్తున్న మరో కారును వెనక నుంచి ఎడ్జ్‌లో ఢీకొట్టటంతో.. సినిమాల్లో చూపించినట్టుగా కారు ఢీకొట్టటంతోనే ముందు వెళ్తున్న కారు ఓవైపు పూర్తిగా పల్టీ కొట్టి చాలా దూరం దూసుకెళ్లింది. అది కూడా ఫ్లైఓవర్‌ అంచున నిర్మించి ఉన్న సిమెంట్ రెయిలింగ్‌ వెంబడే.


అక్కడ సిమెంట్ రెయిలింగ్ ఉండటంతో సరిపోయింది కానీ.. లేకపోతేనా చాలా పెద్ద ప్రమాదమే జరిగిఉండేది. కారు.. అలా పూర్తిగా ఒకపక్కగా ఒరిగి.. దాని వెనుక భాగం ఢీకొట్టిన కారు ముందుభాగంపై నిలిచి ఉండటాన్ని చూస్తుంటే.. భారీ ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పినట్టుగా అర్థమవుతోంది. ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన వాళ్ల గుండెలు ఒక్క క్షణం ఆగినంతపనై ఉంటుంది.


ఈ ఘటనలో ఆ వాహనాల్లో ఉన్న ప్రయాణికులకు ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని కలుగలేదు కానీ.. డ్రైవర్‌కు మాత్రం గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్ వే మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వైపు వెళ్తున్న ఒక కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. కారు ఢీకొన్న ధాటికి అదుపు తప్పిన మొదటి కారు బోల్తా పడగా.. అందులోని డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.


ప్రమాదానికి కారణమైన రెండో వాహనం గురించి ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా.. పోలీసులు క్లియర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com