ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ఇప్పటికే తీవ్ర ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పాక్తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.
పాకిస్తాన్లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలు
కిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలు
కిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలు
డజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలు
లీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలు
అరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలు
కిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలు
కిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు
మరోవైపు.. ఇప్పటికే భారత్ నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో.. అక్కడ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు పాక్ ఆర్థిక నిపుణులు హెచ్చరికలు చేశారు. ఇప్పటివరకు భారత్ నుంచి పాకిస్తాన్కు ఔషధాల ముడి పదార్థాల సుమారు 30 శాతం నుంచి 40 శాతం దిగుమతి అవుతుండగా.. రెండు దేశాల మధ్య వాణిజ్యం ఆగిపోవడంతో అక్కడ ఔషధాల కొరత తీవ్రంగా ఉండనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.
భారత్-పాక్ వాణిజ్య విలువ
గత ఆర్థిక సంవత్సరంలో భారత్-పాక్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ రూ. 3838.53 కోట్లుగా నమోదైంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు అట్టారీ-వాఘా సరిహద్దు కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ఆ మార్గం పూర్తిగా మూసివేయడంతో పాకిస్తాన్కు తక్షణ నష్టమే కాదు, దీర్ఘకాలికంగా ఆర్థికంగా మరింత దిగజారే ప్రమాదం తలెత్తింది.
ప్రపంచ బ్యాంక్ హెచ్చరికలు
ప్రపంచ బ్యాంక్ వెలువరించిన తాజా నివేదిక ప్రకారం.. పాకిస్తాన్లో కోటి మందికి పైగా ఆకలితో విలవిలలాడే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వర్షాభావం, పంట దిగుబడులు తగ్గడం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఆహార కొరత వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతోపాటు 2 శాతం జనాభా వృద్ధి రేటుతో 19 లక్షల మందికి పైగా మిగతా సంవత్సరంలో తీవ్ర పేదరికంలోకి జారుకునే అవకాశాలు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొంది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి
ప్రస్తుతం పాకిస్తాన్ వృద్ధి రేటు 2.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక విధానాలు, భారీ బడ్జెట్ లోటు, పెరిగిన రుణ భారం దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa