జమ్మూ కాశ్మీర్లోని పహల్గా్మ్లో ఇటీవల పాక్ ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ చేసిన మారణ హోమంతో ప్రతీ ఒక్క భారతీయుడి రక్తం మరిగిపోతోంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా పాక్ గడ్డపై ఉన్న ఉగ్రమూకలను ఏరివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో రెండు దేశాల సరిహద్దుల వద్ద తీవ్ర ఘర్షణ తలెత్తగా.. ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి, హోం శాఖ మంత్రి వేర్వేరుగా అనేక భేటీలు నిర్వహించి.. ఏం చేద్దాం అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులతో పాక్ అలర్ట్ అయింది. ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా సైనికులు, ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఏం చేయనుంది.. ఎలాంటి దాడి చేస్తుందోననే భయంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అంతటా ఉన్న అనేక ఉగ్రవాద శిబిరాలను పాక్న్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులను సైనిక స్థావరాలు, బంకర్లకు తరలిస్తున్నట్లు తెలిసింది. భారత నిఘా సంస్థలు.. పీఓకేలో అనేక క్రియాశీల ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన వేళ పాక్ సైన్యం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. నిఘా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముఖం, జురా, లిపా, పచ్ఛిబాన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చామన్కోట్, జంకోట్తో సహా కీలక ప్రాంతాల్లో ఉంటున్న ఉగ్రవాదులను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా.. పాక్ ఉగ్రవాదులు ఈ ఉగ్ర స్థావరాల ద్వారా నియంత్రణ రేఖను దాటి.. జమ్మూ కాశ్మీర్లోకి చొరబడే ముందు వారికి ఇవి ముఖ్యమైన కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో 26 మంది పర్యాటకులను అతి దారుణంగా కాల్చి చంపిన ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసి వెంబడి ఉద్రిక్తతలు పెరగడంతో.. పాక్ సైన్యం అప్రమత్తం అయింది. ఈ క్రమంలోనే భారత నిఘా, ముందస్తు దాడుల నుంచి.. పీఓకేలోని తమ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను రక్షించడానికి పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నట్లు తాజా చర్యలతో అర్థం అవుతోంది.
మరోవైపు.. గత వారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 42 ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరాల్లో దాదాపు 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు.. సరిహద్దు దాటి భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు చెందిన 60 మంది విదేశీ ఉగ్రవాదులు, 17 మంది స్థానిక ఉగ్రవాదులు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో యాక్టివ్గా ఉన్నారని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa