భారత్-పాక్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు. భారత్, పాక్ దేశాలు సరిహద్దుల్లోకి ఆయుధాలు, సైన్యాన్ని, ఇతర యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇక సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన పాక్.. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులతో కవ్విస్తోంది. ఈ పరిణామాలు మొత్తం యుద్ధం రాకకు సూచనలుగా కనిపిస్తు్న్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోననే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదు అనే వార్తలు వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పట్ల భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్.. ఎక్కడ ఉన్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అసిమ్ మునీర్ కనిపించడం లేదు అని పలు నివేదికలు పేర్కొనగా.. మరికొన్ని నివేదికలు మాత్రం ఆయన రావల్పిండిలో దాక్కున్నారని తెలిపాయి. బైసరన్ లోయలో జరిగిన మారణ హోమం తర్వాత.. భారత్లో వెల్లువెత్తుతున్న డిమాండ్ల నేపథ్యంలో అసిమ్ మునీర్ ఆచూకీ తెలియడం లేదంటూ వస్తున్న వార్తలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థ మరోసారి భారత్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ప్రపంచ దేశాల ముందు మరోసారి పాకిస్తాన్ ఇరుకున పడింది.
ఒకవైపు.. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. భారత ఆర్మీ చీఫ్ జమ్మూ కాశ్మీర్కు చేరుకుని పరిస్థితులను దగ్గరుండి నిశితంగా గమనిస్తుండగా.. మరోవైపు.. పాక్ ఆర్మీ చీఫ్ కనిపించడం లేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. భారత్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశాలు ఉన్నాయనే భయంతో అసిమ్ మునీర్ దేశం విడిచి పారిపోయి ఎక్కడో దాక్కున్నారని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన తన కుటుంబంతో సహా మిస్సింగ్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. భారత్తో యుద్ధం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఒక ప్రైవేట్ విమానంలో బ్రిటన్ లేదా న్యూజెర్సీకి కుటుంబంతో సహా అసిమ్ మునీర్ పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంపై పాకిస్తాన్ స్పష్టతనిచ్చింది. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్ అధికారుల ఫోటోను పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్లో షేర్ చేసింది. ఆ ఫోటోలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అబోట్టాబాద్లో ఉన్నట్లు పేర్కొంది. అందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్, పీఎంఏ కాకుల్లోని అధికారులు పీఎంఏ కాకుల్, అబోట్టాబాద్లో జరిగిన 151వ లాంగ్ కోర్సు గ్రాడ్యుయేట్ అధికారులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇది ఏప్రిల్ 26వ తేదీన జరిగింది అన్నట్లుగా పాక్ పీఎంఓ ఆ పోస్ట్ పెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa