పాకిస్థాన్లోని దక్షిణ వజీరిస్తాన్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరెంతో మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకోగా.. అధికారలు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఓ మేజర్ ఆపరేషన్లో 54 మంది ఉగ్రవాదులను హతమార్చామంటూ పాకిస్థాన్ ప్రకటించిన మరుసటి రోజే ఈ బాంబు పేలుడు సంభవించడంతో.. ఉగ్రవాదులే ఈ పని చేసి ఉంటారని పాక్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ముష్కరులను చంపిన ప్రాంతానికి దగ్గల్లోనే ఈ పేలుళ్లు సంభవించాయని చెప్తోంది.
పాకిస్థాన్లోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లా ప్రధాన కార్యాలయం అయిన వానాలోని స్థానిక శాంతి కమిటీ కార్యాలయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అలాగే మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అయితే గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.
మరోవైపు పేలుడు కారణంగా భవనం కూలిపోగా.. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఈ పేలుడు ఎలా సంభవించిందో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 54 మంది ఉగ్రవాదులను చంపామంటూ పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజే ఈ బాంబు పేలుడు సంభవించడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా టెర్రరిస్టులను చంపిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ పేలుడు సంభవించగా.. ఈ పని చేసింది ముష్కరులే అని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పేలుడు బాధ్యత వహిస్తున్నట్లు ఏ సంస్థ కూడా ప్రకటించలేదు.
కానీ పాకిస్థాన్ తాలిబన్ లేదా నిషేధిక తైహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్లు దీనికి కారణం అయ్యుండొచ్చని పాక్ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు సంస్థల నుంచే తరచుగా భద్రతా దళాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారని ఏపీ నివేదించింది. తైహ్రీక్-ఇ-తాలిబన్ ఒక ప్రత్యేక సమూహమే అయినప్పటికీ ఆఫ్ఘన్ తాలిబన్తో స్నేహం కొనసాగిస్తోంది. 20 ఏళ్ల పాటు అఫ్ఘానిస్థాన్పై యుద్ధం చేసిన అమెరికా, నాటో దళాలు యుద్ధం నుంచి వైదొలగడంతో.. 2021 ఆగస్టులో పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు.
ఇక అప్పటి నుంచి టీటీపీ నాయకులు ఆఫ్ఘనిస్థాన్లో బహిరంగంగానే నివసిస్తున్నారు. ఇది పాకిస్థాన్ తాలిబన్లకు కూడా భారీ ధైర్యాన్ని ఇచ్చింది. కాగా 2022 నంవబర్ నెలలో నిషేధిక తైహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పాకిస్థాన్లో ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులలో ఉగ్రవాద సంఘటనలు పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa