ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తెలిపారు. విశాఖపట్నంలో ఇవాళ(మంగళవారం) అసెంబ్లీ పిటిషన్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఆ కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, జగన్మోహన్, కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మీడియాతో మాట్లాడారు.ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని అన్నారు. ఏ ఫిర్యాదు నైనా శాసనసభ్యుల ద్వారా రిఫర్ చేయాలని సూచించారు. ఆయా సమస్యలపైన తమ కమిటీలో చర్చించి, సంబంధిత అధికారులకు లేఖలు పంపిస్తామని తెలిపారు. చర్యలకు రిఫర్ చేస్తామని... కానీ నేరుగా చర్యలు తీసుకునే అధికారం కమిటీకి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని పిటిషన్లు తమ దృష్టికి వచ్చాయని... అయితే సుమోటోగా కేసులు తీసుకునే అధికారం తమకు లేదని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కమిటీ ఉందన్నారు. ఈ కమిటీని పటిష్టంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని రఘురామరాజు వెల్లడించారు.
![]() |
![]() |