పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, సోషల్ మీడియాలో పాకిస్థాన్కు అనుకూలంగా, వివాదాస్పదంగా పోస్టులు చేశారన్న ఆరోపణలపై 30 మందిని అరెస్ట్ చేసినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. అరెస్టయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, "పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 30 మందిని గుర్తించి అరెస్ట్ చేశాం. భారత్, పాకిస్థాన్ల మధ్య సారూప్యత లేదు, శత్రుత్వం ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి" అని తెలిపారు. అరెస్టయిన వారి గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అరెస్టయిన వారిలో అసోంతో పాటు పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపురకు చెందిన వారు కూడా ఉన్నారని సీఎం వివరించారు. వీరిలో ఒక ఎమ్మెల్యే, కొందరు విద్యార్థులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారని తెలిపారు. మొదట 24 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఆ తర్వాత సంఖ్య 30కి చేరిందని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, 2019 పుల్వామా దాడి నుంచి ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి వరకు జరిగిన సంఘటనలన్నీ ప్రభుత్వ ప్రాయోజిత కుట్రలేనంటూ ఆరోపణలు చేసిన తమ రాష్ట్ర ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై ఇప్పటికే దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ గుర్తుచేశారు.
![]() |
![]() |