కూటమి ప్రభుత్వం వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక సహాయాన్ని రూ.20,000కు పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మత్స్యకారులు బోట్లపై ర్యాలీ నిర్వహించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా ఏటి మొగ్గ నుంచి జగన్నాథపురం వంతెన వరకు సాగిన ఈ ర్యాలీలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ బోట్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టి ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రూ.20,000 ఆర్థిక సహాయం ప్రకటించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు "థాంక్యూ సీఎం సార్" కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారని ఆయన అన్నారు.
![]() |
![]() |