ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే 36 గంటల్లోపే మాపై భారత్ దాడిచేయొచ్చు.. పాక్ మంత్రి

international |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:48 PM

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి అగ్గిరాజుకుంది. పహల్గామ్ దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర చేసినట్టు ఆధారాలు కూడా బయలపడ్డాయి. దీంతో భారత్ తమపై తప్పుకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని దాయాది పాకిస్థాన్ ఫిక్స్ అయిపోయింది. దీంతో పాక్ పాలకులు, నాయకులు కారుకూతలు కూస్తూ.. భారత్‌ను మరింత రెచ్చగొడుతున్నారు. భారత్ తమపై దాడిచేస్తే.. అణుబాంబులు సిద్ధం చేశామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ఈ క్రమంలో నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే 24–36 గంటలలోపే ఇస్లామాబాద్‌పై భారత్ సైనిక చర్య చేపట్టబోతుందని పాకిస్థాన్ తాజాగా ప్రకటించింది. అదే జరిగితే పరిణామాల తీవ్రంగా ఉంటాయని భారత్‌ను హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతుల్లాహ్ తరార్ హెచ్చరిక జారీచేశాడు.


తరార్ మాట్లాడుతూ.. ‘పహల్గామ్ ఉగ్రదాడిలో తమ పాత్ర ఉన్నట్ుట ఆధారాలు లేని, కల్పిత ఆరోపణల ఆధారంగా భారత సైన్యం దాడికి సిద్ధమవుతోంది’ అని చెప్పారు. ‘భారత్ న్యాయమూర్తి, జ్యూరీ, శిక్షాప్రకటనాధికారి పాత్ర పోషిస్తోంది.. ఆ పాత్రను పాక్ తిరస్కరిస్తుంది.. బాధ్యతయుతమై దేశంగా పాకిస్థాన్ వాస్తవాలను నిర్దారించడానికి నిపుణులతో కూడిన తటస్థ కమిటీ ద్వారా విశ్వసనీయమై, పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తును కోరుతోంది’ అని ఆయన తెలిపారు. అలాగే, ఉగ్రవాదానికి తమ దేశం కూడా బలైందని ఆయన గుర్తుచేశారు. పాకిస్థాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పునరుద్ఘాటించిన తరార్... అంతర్జాతీయ సమాజం వాస్తవాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతలకు, దాని పరిణామాలకు పూర్తి బాధ్యత భారత్‌పై ఉంటుందని అతడు హెచ్చరించారు.


భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే పాక్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత క్షణం తీరిక లేకుండా వరుస భేటీలు నిర్వహిస్తూ దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అనేది కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే దౌత్య పరంగా, ఆర్థిక పరంగా పాకిస్తాన్‌ను దెబ్బ కొట్టిన భారత్.. మరిన్ని ఆంక్షలు, నిషేధాలతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధం అవుతోంది. కేవలం యుద్ధం, సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే కాకుండా.. మోదీ సర్కార్ మరింత పెద్ద ప్లాన్ వేస్తోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.


అటు భారత, పాక్‌లు ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నాయి. దీంతో ఏ నిమిషంలోనైనా యుద్ధం రావచ్చని భావిస్తోన్న పాక్.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ యుద్ధానికి సన్నద్ధం అవుతోంది. ప్రపంచ దేశాలన్ని పహల్గాం ఉగ్రదాడిని ఖండించగా.. టర్కీ, చైనా మాత్రం పాక్‌కు అండగా నిలుస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com