ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడాలో లిబరల్స్ ఘన విజయం.. భారత్‌తో సంబంధాలు మెరుగవుతాయా?

international |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:51 PM

భారత్-కెనడా మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉండగా.. గత కొన్నేళ్లుగా దెబ్బతిన్నాయి. ఇక కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో ఎన్నికైన తర్వాత ఇవి మరింత దారుణంగా క్షీణించాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి అప్పుడు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారి తీశాయి. ఈ క్రమంలోనే భారత్-కెనడా దౌత్య సంబంధాలు ఎన్నడూ లేని విధంగా తీవ్రంగా దిగజారాయి. ఇక జస్టిన్ ట్రూడో తీసుకున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న తీరుతో సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. చివరికి ఆయన పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే తాజాగా జరిగిన కెనడా ఎన్నికల్లో లిబరల్స్ పార్టీ గెలిచింది. దీంతో కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే మార్క్ కార్నీ హయాంలో భారత్‌తో సంబంధాలు మెరుగుపడనున్నట్లు అర్థం అవుతోంది.


జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న భారత్-కెనడా సంబంధాలను పునరుద్ధరిస్తామని మార్క్ కార్నీ హామీ ఇచ్చారు. దీంతో మార్క్ కార్నీ రాకతో రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగుపడే అవకాశాలు ఉన్నాని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని మార్క్ కార్నీ కూడా భావిస్తున్నారు. భారత్‌తో తెగిపోయిన సత్సంబంధాలను పునరుద్ధరించడానికి కృషి చేస్తానని మార్క్ కార్నీ ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇవ్వగా.. ప్రస్తుతం గెలిచిన తర్వాత కూడా మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంలో భారత్, కెనడా లాంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని మార్క్ కార్నీ అభిప్రాయపడ్డారు.


ఇక తాము అధికారంలోకి రాగానే భారత్‌తో సహా ఇతర సారూప్య దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. భారత్-కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటానని మార్క్ కార్నీ తేల్చి చెప్పారు. మరోవైపు.. మార్క్ కార్నీ నేతృత్వంలో భారత్-కెనడా సంబంధాలు తిరిగి గాడిన పడతాయని.. వాణిజ్య, దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు కూడా తాజా పరిణామాలు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


జస్టిన్ ట్రూడో హయాంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఆయన భారత్‌పై చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినేలా చేశాయి. ఇక ట్రూడో ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్.. కీలక చర్యలకు దిగింది. దీంతో ఇరు దేశాలు తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిచాయి. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆరోపణలు కూడా రెండు దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచాయి.


మరోవైపు.. కెనడా ఎన్నికల్లో మార్క్ కార్నీ విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన పట్ల నిబద్ధతతో భారత్-కెనడా సంబంధాలు కొనసాగుతున్నాయని మోదీ తెలిపారు. భవిష్యత్తులో కెనడాతో కలిసి పనిచేయడానికి.. ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి తాము ఎదురుచూస్తున్నట్లు మోదీ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com