ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 10:32 PM

ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మొత్తంగా 26 మంది పర్యటకులను అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఇక ఆపై స్థానిక అడవుల్లోకి పారిపోగా.. భారత సైన్యం వారిని పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ కెల్లర్ పేరుతో ముష్కరుల కోసం ముమ్మర వేట సాగిస్తోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో పకడ్బందీగా వేట సాగిస్తున్నాయి భద్రతా బలగాలు. ఇప్పటికే ఆరుగురు ఉగ్రవాదులను అంతమొందించింది సైన్యం. ఈ క్రమంలో లష్కరే తొయిబాతో సంబంధాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు.


జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం జిల్లాలో ఉగ్రవాదులు అరెస్టులు చోటుచేసుకున్నాయి. వారు ఆ ప్రాంతంలోనే ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు ప్రయత్నించారని, స్థానికులను తమ గ్రూపులోకి చేర్చుకునేందుకు యత్నించారన్న సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముజామిల్ అహ్మద్, ఇష్ఫక్ పండిట్, మునీర్ అహ్మద్‌గా వారిని గుర్తించారు. ఈ ముగ్గురి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారికి లష్కరే తొయిబా ఉగ్రవాది అబిద్ కయ్యూమ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.


జమ్మూకశ్మీర్‌ అంతటా ఆపరేషన్ కెల్లర్ ముమ్మరంగా సాగుతోంది. మే 13వ తేదీన లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను, అలాగే మే 15వ తేదీన జైషే మహమ్మద్‌కు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.


అయితే ఈ ముగ్గురు జేషై మహ్మద్ ముఠాకు చెందిన వారని తెలుసుకున్నారు. హతులను ఆసిఫ్ అహ్మద్ షేక్, ఆమిర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్ గా గుర్తించారు. వీరు చనిపోవడానికి ముందు దాక్కున్న వీడియోను కూడా ఆర్మీ విడుదల చేసింది. అలాగే ఆమిర్ నజీర్ వని కాల్పులకు ముందే తన తల్లికి, ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరికి ఫోన్ చేశాడు. వారు వీరందరినీ లొంగిపోమని చెప్పినా వినకుండా పోలీసులను, సైన్యాన్ని చంపేస్తామంటూ ప్రగల్భాలు పలికాడు. చివరకు ప్రాణాలు కోల్పోగా.. ఈ వీడియో కాల్ కూడా లీక్ అయింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా.. అతడి తల్లి మాట్లాడిన మాటల విని అంతా కన్నీరు కార్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com