ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడాకులు ఇచ్చినా భర్త భరణం చెల్లించాల్సిందే: కోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 11:39 PM

విడాకుల కేసులో ఎన్నారై భర్తకు షాక్ ఇచ్చింది గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని స్థానిక కోర్టు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని.. తనను హింసించిందని పేర్కొంటూ భర్త విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే ఆ భార్య.. తనకు భర్త నుంచి భరణం ఇప్పించాలని మరో కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా అహ్మదాబాద్ స్థానిక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని భర్త చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. అదే సమయంలో ఆమెకు గృహ హింస చట్టం కింద రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని.. వాటితోపాటు నెలకు రూ.40 వేలు భరణం, రూ.20 వేలు ఇంటి అద్దె లెక్కన చెల్లించాలని ఆదేశించింది.


ఆ మహిళకు భరణం మంజూరు చేస్తూ.. తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని.. వ్యభిచారం, క్రూరత్వం ప్రాతిపదికన ఫ్యామిలీ కోర్టు తనకు విడాకులు మంజూరు చేసిందని భర్త చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. అందువల్ల తన భార్య భరణానికి అర్హురాలు కాదని భర్త వాదించాడు. అయితే అతను సరైన సమయంలో ఈ వాదనను వినిపించలేదని పేర్కొంటూ కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. రెండు వైపులా సాక్ష్యాలను పరిశీలిస్తే.. దరఖాస్తుదారు క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో భర్త తన అఫిడవిట్‌లో దరఖాస్తుదారు వివాహేతర సంబంధాల గురించి వాదన వినిపించాడు. అయితే ఆ దరఖాస్తు దాఖలు చేసినప్పుడు భర్త ఎలాంటి ఆధారాలు దాఖలు చేయలేదని కోర్టు గుర్తించింది. అప్పటికే 2023 జనవరి 1వ తేదీన ఫ్యామిలీ కోర్టు వ్యభిచారం, క్రూరత్వం ప్రాతిపదికన వారికి విడాకులు మంజూరు చేసింది. అందువల్ల భార్య పాత్ర గురించి భర్త చేసిన వాదనను అంగీకరించలేమని అహ్మదాబాద్ రూరల్ కోర్ట్‌లోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ కేసులో భరణం కోసం కోర్టుకెక్కిన మహిళ స్వస్థలం గాంధీనగర్‌ కాగా.. భర్త అహ్మదాబాద్‌లోని సబర్మతి ప్రాంతానికి చెందినవాడు. వీరిద్దరికీ 2006లో పెళ్లి జరగ్గా.. ఆ తర్వాత వారు అబుదాబి వెళ్లారు. అయితే ఆ మహిళ అక్కడ గృహ హింసకు గురైందని ఆరోపించారు. వారికి 2012లో ఒక కుమారుడు పుట్టాడు. వారి మధ్య గొడవలు తీవ్రం కావడంతో ఆమె తన కుమారుడితో కలిసి 2016లో పుట్టింటికి తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె భర్త విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. అహ్మదాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టులో భరణం కావాలని ఆమె కూడా కోరింది. 2017లో సబర్మతి పోలీస్ స్టేషన్‌లో ఆమె తన భర్తపై ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసింది. గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద ఫిర్యాదు చేసింది.


2023 జనవరి 20వ తేదీన వ్యభిచారం, క్రూరత్వం ప్రాతిపదికన కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే అంతకుముందు ఆమెకు, కుమారుడికి కలిపి నెలకు రూ. 40 వేలు భరణం, ఇంటి అద్దె కింద మరో రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిహారం కింద రూ.25 లక్షలు కూడా చెల్లించాలని ఆ భర్తను ఆదేశించింది. విచారణ తర్వాత ఆ మహిళ గృహ హింసకు గురైందని గుర్తించింది. అయితే తాను ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నానని.. భరణం చెల్లించుకోలేనని ఆమె భర్త వాదించాడు. కానీ ఆ వాదనను కోర్టు నమ్మలేదు. యూఏఈలో రెండో భార్యతో జీవిస్తున్న వ్యక్తి భరణం తప్పించుకునేందుకే తాను నిరుద్యోగి అని వాదించాడని తేల్చింది. దీంతో భార్యకు భరణం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com