ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతి చర్చలకు సిద్ధమే, కానీ.. మళ్లీ అదేపాట పాడిన పాక్ ప్రధాని!

international |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 11:51 PM

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం భారతదేశాన్ని శాంతి చర్చలకు ఆహ్వానించారు. ‘శాంతికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన ప్రకటించారు. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా షేహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో పాల్గొన్న అధికారులు, జవాన్లతో షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘భారతదేశంతో మేము శాంతి కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నాం... కానీ, శాంతి కోసం అవసరమైన షరతుల్లో కశ్మీర్ అంశం తప్పనిసరిగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికే కశ్మీర్‌‌పై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారత్‌లోని అవిభాజ్యమైన, అంతర్భాగాలు అని పునరుద్ఘాటించింది.


కమ్రా ఎయిర్‌బేస్‌ను సందర్శించిన వారిలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7 తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది. భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయి, ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మెరుపు దాడుల్లో ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతో మే 8, 9, 10 తేదీల్లో పాక్.. భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి యత్నించింది. కానీ, భారత సైన్యం వీటిని చిత్తుచేసి.. క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది.


అనంతరం భారత్ ఘాటుగా ప్రతిదాడి చేసింది. రఫికీ, మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సక్కర్, చునియాన్ వంటి పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత దళాలు దాడులు నిర్వహించాయి. నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య కొనసాగిన సైనిక ఘర్షణ మే 10న కాల్పుల విరమణ ఒప్పందంతో నిలిచిపోయింది. భారత్, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో సరిహద్దుల్లో దాడులు ఆగిపోయాయి.


కాగా, కమ్రాన్‌ వైమానిక స్థావరం సందర్శనకు ముందు బుధవారం షెహబాజ్ షరీఫ్ సియాల్‌కోట్‌లోని పస్రూర్ కంటోన్మెంట్ స్థావరాన్ని కూడా సందర్శించి అక్కడి సైనికులతో మమేకమయ్యారు. ఘర్షణ అనంతరం ఆయన సందర్శించిన రెండో రక్షణ స్థావరం కమ్రా. అయితే, భారత ప్రధాని మోదీని షెహబాజ్ కాపీకొట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌లో కీలక పాత్రపోషించిన పంజాబ్‌లోని ఆదంపూర్‌ వైమానిక స్థావరాన్ని మోదీ సందర్శించిన తర్వాతే.. పాక్ ప్రధాని తన వైమానిక కేంద్రాలకు వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చిన నవ్వులపాలయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com