ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్తున్నారా.. మీపై కేసులు బుక్ చేస్తారు జాగ్రత్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 11:30 PM

ఏపీలోని ఉమ్మడి చిత్తూరుతో పాటూ ఉమ్మడి కడప జిల్లాలోకి శేషాచలం అడవి విస్తరించి ఉంది. శేషాచలం అడవుల్లోకి అక్రమంగా ప్రవేశాన్ని అడ్డుకోవడానికి అటవీ శాఖ సిద్ధమైంది. అటవీ చట్టాలను అతిక్రమించిన వారిపై కొరడా ఝుళిపించడానికి సిద్ధమైంది. ఇటీవల కాలంలో ఘటనలతో శేషాచలం అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకోవడానికి అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటవీ చట్టాలను ఉల్లంఘించి అడవుల్లోకి ప్రవేశించే వారిపై నిషేధం విధించింది. గత కొన్నేళ్లుగా చట్టవిరుద్ధంగా ట్రెక్కింగ్ సంస్థలు నిర్వహిస్తూ, అడవుల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటోంది. అనధికారికంగా ట్రెక్కింగ్ నిర్వహిస్తున్న వారిపై విచారణ జరిపి, వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది.


శేషాచలం అటవీ ప్రాంతంలో అక్రమంగా ట్రెక్కింగ్ నిర్వహిస్తున్న సంస్థలను గుర్తించి, వారిపై విచారణకు ఆదేశించింది. తలకోన, అన్నమయ్య జిల్లాల పరిధిలో ఇటీవల జరిగిన అనధికార ట్రెక్కింగ్‌లకు కారణమైన సంస్థల నిర్వాహకులపై, సహకరించిన అటవీ శాఖ అధికారులపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. భాకరాపేట రేంజ్ పరిధిలోని తలకోన, అన్నమయ్య డివిజన్‌లో అక్రమంగా ట్రెక్కింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేశారు. తలకోన పరిధిలో నిషేదాజ్ఞలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమోలు జారీ చేశారు.


సోషల్ మీడియా ద్వారా ట్రెక్కర్లను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ట్రెక్కింగ్ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి అటవీ శాఖ సిద్ధమవుతోంది. తిరుపతి సీఎఫ్ సెల్వం ఆదేశాల మేరకు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో తిరుపతి సబ్ డీఎఫ్‌వో, తిరుపతి, భాకరాపేట, పనపాకం, సత్యవేడు, పుత్తూరు రేంజర్లు విచారణ అధికారులుగా ఉంటారు. గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ద్వారా ట్రెక్కర్లతో కలిసి శేషాచలం అడవుల్లో అనధికారికంగా ట్రెక్కింగ్‌లు నిర్వహిస్తున్న సంస్థలను అటవీ శాఖ గుర్తించింది. అనుమతులు లేకుండా అడవుల్లో తిరుగుతూ.. షెడ్యూల్-1 కిందకు వచ్చే వన్యప్రాణులను ఫోటోలు తీస్తూ, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని కూడా గుర్తించారు. ఈ క్రమంలో 8 ట్రెక్కింగ్ సంస్థలను గుర్తించారని చెబుతున్నారు.


అటవీ శాఖ అనుమతులు లేకుండా శేషాచలం అడవుల్లోకి ప్రవేశించి, వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్-1 కిందకు వచ్చే, I.U.C.N జాబితా ప్రకారం అంతరించిపోతున్న జంతువుగా గుర్తింపు పొందిన స్లెండర్ లోరీస్ (దేవాంగపిల్లి)ని ఫోటోలు తీసిన వ్యక్తిపై కూడా చర్యలు తీసుకోనున్నారు. ఈ సంస్థలపై, నిర్వాహకులపై విచారణ జరిపి, కేసులు నమోదు చేయడానికి విచారణ కమిషన్ పనిచేస్తుంది. అటవీ శాఖ అధికారులు అడవుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అటవీ చట్టాలను అతిక్రమించి అడవుల్లోకి ప్రవేశించేవారిని నియంత్రించేందుకు నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com