ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఎటువంటి ఒప్పందం జరగాలన్నా, ఆ దేశం బేషరతుగా లొంగిపోవడం మినహా మరో మార్గం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ చేశారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి! ఆ తర్వాత అక్కడ గొప్ప, ఆమోదయోగ్యమైన నాయకత్వం రావాలి. అప్పుడే మేము, మా మిత్రదేశాలు కలిసి ఇరాన్ను వినాశనం అంచుల నుంచి బయటకు తీసుకొస్తాం. ఇరాన్ను ఆర్థికంగా మునుపటి కంటే బలంగా తీర్చిదిద్దుతాం. ఇరాన్కు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఎన్నికల నినాదాన్ని గుర్తుచేస్తూ మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్అంటూ కొత్త నినాదాన్ని వినిపించారు.మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. క్షిపణి దాడులు, నావికాదళ దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు విస్తృతం చేయగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. కొన్ని రోజుల కిందట హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడం ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్లో వెయ్యి మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్, లెబనాన్లలో డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్పై బాంబుల వర్షం కురుస్తుండటంతో వేలాది మంది రాజధానిని వదిలి పారిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా, ట్రంప్ యుద్ధ అధికారాలను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలను వాషింగ్టన్లో సెనేట్ రిపబ్లికన్లు అడ్డుకున్నారు. ప్రస్తుతానికి అమెరికా బలగాలు నేరుగా రంగంలోకి దిగకపోయినా, భవిష్యత్తులో ఆ అవకాశాన్ని వైట్హౌస్ కొట్టిపారేయలేదు. ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్రంగా పడుతోంది. హార్ముజ్ జలసంధిలో దాడుల భయంతో నౌకల రాకపోకలు తగ్గిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 90 డాలర్లకు చేరాయి. భద్రతా కారణాల దృష్ట్యా పలు షిప్పింగ్ సంస్థలు తమ సర్వీసులను నిలిపివేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa