ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే.. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా షాక్ తప్పడం లేదు. ఇవాళ మరోసారి స్థానిక సంస్థలకు సంబంధించిన పదవుల కోసం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.. వైఎస్సార్సీపీకి మరికొన్ని పదవులు చేజారాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. మున్సిపల్ చైర్ పర్సన్గా దిల్షా దున్నీషా..వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారి సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.. అయితే ఈ ఎన్నికను వైఎస్సార్సీపీ బహిష్కరించింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 ఉంటే.. 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అంతకముందు బెంగళూరు క్యాంప్లో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు.. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక.. అనంతరం వైస్ చైర్మన్ల ఎంపిక ఏకగ్రీవమైంది.
మరోవైపు విజయనగరం జిల్లా బొబ్బలి మున్సిపల్ ఛైర్మన్గా టీడీపీకి చెందిన శరత్బాబు ఎన్నికయ్యారు. గత నెల 29న గత ఛైర్మన్ మురళీకృష్ణారావుపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఇవాళ అవిశ్వాస ఓటింగ్లో టీడీపీ గెలవడంతో మురళీకృష్ణారావు ఛైర్మన్ పదవి కోల్పోయారు. 20 మంది సభ్యుల మద్దతుతో బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి ఖాతాలోకి చేరింది. ఇక తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపడింది.. కోరం లేకపోవడంతో మంగళవారానికి ఎన్నిక వాయిదా వేశారు. మొత్తం 20 మందికి గాను ఏడుగురు మాత్రమే హాజరుకావడంతో వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. శ్రీసత్యసాయిజిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరుకావడంతో ఎన్నిక వాయిదా పడింది. గతంలో కోరం లేక ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది.
ఇటు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఉన్నతాధికారులు ఈ ఎన్నిక మంగళవారానికి వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 56 మంది కార్పొరేటర్లు కావాల్సి ఉండగా.. సోమవారం 54 మంది మాత్రమే వచ్చారు. ఈ కారణంతోనే ఎన్నిక వాయిదాపడింది. డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించారు.
![]() |
![]() |