ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.. భారత సైన్యం ఎలా తిప్పికొట్టిందంటే

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:50 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలోని ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా భారత సైన్యం విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రవాద క్యాంప్‌లపై దాడులు చేసి 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తగా.. భారత్‌పైకి చైనా ఇచ్చిన డ్రోన్లు, క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే భారత్ తయారు చేసినవే కాకుండా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 మిసైల్ సిస్టమ్ కూడా పాక్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని కీలక ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులు చేయాలని నిర్ణయించుకున్నా.. భారత డిఫెన్స్ సిస్టమ్ ముందు అవేమీ పని చేయలేదు. దీంతో ప్రపంచ దేశాల ముందు పాక్ నవ్వులపాలైంది. అయితే ఈ దాడులకు సంబంధించి కీలక విషయాలు బయటికి వచ్చాయి.


పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భారీ వైమానిక దాడిని జరిపిందని.. అయితే ఈ దాడిని భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. డ్రోన్లు, లాంగ్ రేంజ్ మిసైల్స్‌లతో పాక్ నుంచి దాడులు జరగ్గా.. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న భారత్.. వాటిని గుర్తించి తక్షణమే అడ్డుకున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆకాష్ మిసైల్ సిస్టమ్, ఎల్-70 ఎయిర్ డిఫెన్స్ గన్‌లతో సహా అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించి.. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయానికి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడినట్లు వెల్లడించింది.


అయితే ఆపరేషన్ సిందూర్ వేళ.. దేశంలోని ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే గోల్డెన్ టెంపుల్ చుట్టూ మరిన్ని ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌లను మోహరించారు. ఈ కారణంగానే పాకిస్తాన్ వైమానిక దాడి నుంచి రక్షణ లభించినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఇండియన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి మేజర్ జనరల్ కార్తిక్‌ సి శేషాద్రి మాట్లాడుతూ.. మే 8వ తేదీన తెల్లవారుజామున పాకిస్తాన్ మానవరహిత వైమానిక ఆయుధాలు, ప్రధానంగా డ్రోన్లు, లాంగ్ రేంజ్ క్షిపణులతో భారీ వైమానిక దాడికి దిగిందని తెలిపారు. అయితే ఇలాంటి దాడులను ముందుగానే ఊహించినందున తాము ప్రతిదాడికి పూర్తిగా సిద్ధమై ఉన్నట్లు చెప్పారు.


వెంటనే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ.. ఎయిర్ డిఫెన్స్ గన్నర్లను ఉపయోగించి పాకిస్తాన్ దాడులను భగ్నం చేశారని స్పష్టం చేశారు. స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న జరిపిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసినట్లు తెలిపారు. దీంతో గోల్డెన్ టెంపుల్‌కు చిన్న గీత కూడా పడకుండా ఇండియన్ ఆర్మీ కాపాడినట్లు మేజర్ జనరల్ కార్తిక్‌ సి శేషాద్రి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com