ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఓకేలో లష్కరే ఉగ్రవాదులతో పాక్ సైన్యం భేటీ

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:56 PM

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోయిన ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన భారత సైన్యం.. మే 7 తేదీ తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనిని జీర్ణించుకోలేని పాకిస్థాన్.. భారత్ సరిహద్దు నగరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా దాడులకు యత్నించింది. నాలుగు రోజులు ఇరు సైన్యాల మధ్య కొనసాగిన ఘర్షణలు.. మే 10న కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉండగా, సరిహద్దుల్లో మరోసారి ఉగ్రమూకలను కశ్మీర్‌లోకి ఎగదోసేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తున్నట్టు సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.


ఆ నివేదిక ప్రకారం.. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు భారత సరిహద్దుకు సమీపంలో చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు. పహల్గామ్ దాడి కూడా లష్కరే సంబంధం ఉన్న ది రెసిడెంట్ ఫ్రంట్ హస్తం ఉన్న విషయం తెలిసిందే. ఓ జాతీయ పత్రిక నివేదిక ప్రకారం..శనివారం పాకిస్థాన్ సైన్యం, లష్కరే తొయిబా (LeT) ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (LoC) వద్ద చేరినట్టు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ తాహా సిద్దీకీ ఎక్స్ ( ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. పాక్ సైనికాధికారులతో లష్కరే తొయిబా కమాండర్‌లు పాక్-ఆధిపత్య కశ్మీర్లో సమావేశమయ్యారని, ఆ తరువాత వారు నియంత్రణ రేఖ వద్దకు వెళ్లారని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆర్మీ.. సరిహద్దుల్లో భూగర్భ సొరంగాలను ద్వారా భారత్‌లోకి లష్కర్ తొయిబా ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ వైమానిక, సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.


పాకిస్థాన్ సొరంగాలను ఉపయోగించుకుని అడవుల్లో, గిరిజన ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్టు గతంలో నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏప్రిల్‌లో ఓ జాతీయ మీడియా నివేదిక కూడా భూగర్భ సొరంగాలను చొరబాటుకు ఉపయోగించేుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మరోసారి అలాంటి నివేదికలు వెలుగులోకి రావడంతో బీఎస్ఎఫ్, భారత సైన్యం తమ నిఘాను పెంచాయి.


పహల్గామ్ దాడి తర్వాత ఒక అధికారి మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ కందకాల కింద చాలా లోతైన సొరంగాలు తవ్విందా? తద్వారా చొరబాట్లు జరగొచ్చా? అవసరమైతే మన దళాలను పంపొచ్చా? అని తెలుసుకునే పనిని మాకు అప్పగించారు’ అని చెప్పారు. సొరంగం నిర్మాణంలో సహాయానికి సరిహద్దు సమీపంలో మాజీ సైనికులను కూడా పాక్ మోహరించిందని అధికారులు చెప్పినట్లు నివేదిక పేర్కొంది.


పాకిస్థాన్‌లోని ఉగ్రమూకలు భారతదేశంలో తరుచూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నివేదిక ఆందోళనకు గురిచేస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’తో జైషఏ మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ అడ్డుకోవడానికే ఉగ్రమూకలను ప్రేరేపించి భారత్‌పై దాడులకు కుట్రలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలు మరింత ఆందోళనలకు దారితీస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com