ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటిపండు ఆశ చూపించి.. , మూడేళ్ల బాలికపై దారుణం

Crime |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 08:57 PM

మూడేళ్ల బాలిక.. ముక్కుపచ్చలారని వయసు.. మేకతోలు కప్పుకున్న పులులు తిరిగే సమాజంలో.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ప్రాయం.. కనిపించిన ప్రతిదీ వింతగా.. ఎదురయ్యే ప్రతి మనిషి మంచోడిగా అనుకునేది. అందరినీ అమ్మానాన్నలుగానే భావించేది, ఓ రోజు ఇంట్లో వాళ్లు వేరే ఊరికి బయల్దేరారు. బంధువుల ఇంట్లో పెళ్లంటే చిన్నారిని వెంట బెట్టుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లాక అంతా కొత్తగా ఉంది.. కొత్త వాతావరణం, కొత్త మనుషులు.. అంతా కొత్త కొత్తగా ఉంది.. చిన్నారికి భలే సంతోషం వేసింది. బాజా భజంత్రీలు, లైట్లు, పాటలు ఆ కోలాహలమంతా చిన్నారికి కొత్తగా అనిపించింది. అలా ఆడుకోవాలని అనిపించి.. అమ్మానాన్న నుంచి కాస్త దూరం జరిగింది.. అయితే అదే తన పాలిట శాపంగా మారుతుందని.. జింక కోసం మాటువేసిన పులిలా, మనిషి రూపంలో తిరిగే మృగం కాచుకుని కూర్చుందని పసిగట్టలేకపోయింది..


నవ్వుతూ పలకరించాడు.. మురిసిపోయింది.. ఎత్తుకుని గారాబం చేశాడు.. సంతోషపడిపోయింది.. అరటిపండు ఇస్తానని ఆశజూపాడు.. నమ్మేసింది.. కసాయి వాడిని నమ్మిన గొర్రెలా అమాయకంగా బలైపోయింది. మేకవన్నె పులులు తిరిగే సమాజంలో.. లోకం పోకడ తెలియని ఓ పసిప్రాణం.. ముళ్లపొదల మాటున అర్థాంతరంగా ఆర్తనాదాలు చేస్తూ ముగిసిపోయింది.. రాక్షసుడి చేతికి చిక్కిన రామచిలుకలా వణుకుతూ.. అమ్మానాన్న కోసం అరుస్తూ.. నవ్వుతూ పలకరించిన వాడి వికృతి రూపాన్ని కళ్లారా చూస్తూ.. బాధతో విలవిలలాడుతూ ఆ రాక్షసుడి చేతిలో ప్రాణం కోల్పోయింది..


కడప జిల్లా మైలవరం మండలంలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లిదండ్రులతో పాటుగా పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల చిన్నారి.. కనిపించకుండా పోయింది. పెళ్లి మండపం వద్ద ఆడుకుంటున్న చిన్నారి.. అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి చిన్నారి కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులకు అంతులేని వేదనను మిగుల్చుతూ చిన్నారి మృతదేహం శుక్రవారం ముళ్లపొదల్లో కనిపించింది. ప్రొద్దుటూరుకు చెందిన ఈ కుటుంబం బంధువుల పెళ్లి కోసం మైలవరం మండలానికి వచ్చారు. పెళ్లి హడావిడిలో ఉన్న సమయంలో చిన్నారి కనిపించకుండా పోయింది.. చివరకు శుక్రవారం శవమై తేలింది. అయితే బాలికపై అత్యాచారం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల బాలికకు అరటి పండు ఆశ చూపించి పెళ్లి మండపం వద్ద నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం.


ముళ్లపొదల్లోకి బాలికను తీసుకెళ్లిన అతను.. బాలికపై అత్యాచారం చేసి, విషయం బయటపడుతుందనే భయంతో ఆపై హత్యచేసినట్లు తెలిసింది. స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తున్న సమయంలో స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. పోలీస్ వాహనంపైకి దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి ముళ్లపొదల్లో విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు.. స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com