ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదంపై ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 08:52 AM

అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు, విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న ఐదుగురు పౌరులు కూడా మరణించారు. ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్‌కు ఈ క్లిష్ట సమయంలో అండగా నిలుస్తామని, అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం అదుపుతప్పి సమీపంలోని నివాస భవనాలపై కూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, ప్రయాణికులెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. విమానం కూలిన భవనాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు కూడా మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.మృతుల్లో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒక కెనడియన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాద ధాటికి సమీపంలోని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విమాన శకలాలు, కాలిపోయిన వస్తువులు ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దుర్ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్"భారత్ ఒక పెద్ద, బలమైన దేశం. ఈ పరిస్థితిని అధిగమించగలదు" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అవసరమైతే సహాయం అందించడానికి అమెరికా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. కష్ట సమయాల్లో భారత్, అమెరికా మధ్య ఉన్న దీర్ఘకాల సహకారాన్ని ట్రంప్ ప్రకటన ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభం కాగా, ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు భారత్‌కు తమ సానుభూతిని, మద్దతును తెలియజేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa