అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం ఒక్కసారిగా కుప్పకూలగా.. మొత్తంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జనరల్ ఎలక్ట్రిక్ ఇంజిన్లతో నడిచే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలకు ఇకపై కఠినమైన భద్రతా తనిఖీలను నిర్వహించాలని ఆదేశించింది. అయితే దీన్ని జూన్ 15వ తేదీ నుంచే అమలు చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది.
లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ-171.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్లో కుప్పకూలింది. ఈ దారుణ ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రయాణీకులతో పాటు, నేలపై ఉన్న 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అలాగే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. విమాన ప్రమాదంపై వెంటనే దర్యాప్తు చేసి.. అందుకు గల కారణాలు, బాధ్యులను గుర్తించాలన్నారు. మరోవైపు అధికారులు దర్యాప్తులో భాగంగా విమానంలో ఉన్న డేటాను రికార్డు చేసే బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ బ్లాక్ బాక్సు ప్రమాదానికి గల కారణాలను కనుగొనడంలో కీలకం కానుంది. ఇదిలా ఉండగానే ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఎయిర్ ఇండియాకు చెందిన జీఈ జీఎన్ఎక్స్ ఇంజిన్లతో నడిచే అన్ని బోయింగ్ 787-8, 787-9 డ్రీమ్లైనర్లపై సమగ్ర తనిఖీలకు ఆదేశించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. జూన్ 15వ తేదీ రాత్రి నుంచి భారత్ నుంచి బయలు దేరే ప్రతీ విమానాన్ని ఒకసారి తనిఖీ చేయబోతున్నారు. ఇది తప్పనిసరి కానుంది.
ముఖ్యంగా ఇంధన పారామీటర్ పర్యవేక్షణ, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, సంబంధిత వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ ఇంజిన్ నియంత్రణ-వ్యవస్థ పరీక్ష, ఇంజిన్ ఇంధనంతో నడిచే యాక్యుయేటర్ ఆపరేషనల్ టెస్ట్, ఆయిల్ సిస్టమ్ చెక్ వంటి అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. అంతేకాకుండా హైడ్రాలిక్ సిస్టమ్ సర్వీసబిలిటీ చెక్, టేకాఫ్ పారామీటర్ల సమీక్ష, ట్రాన్సిట్ తనిఖీలో 'ఫ్లైట్ కంట్రోల్ ఇన్స్పెక్షన్' ప్రవేశ పెట్టడం, రెండు వారాల్లో పవర్ అస్యూరెన్స్ చెక్లు, గత 15 రోజుల్లో B787-8/9 విమానాలలో పునరావృతమైన సాంకేతిక లోపాలను (స్నాగ్స్) వీలైనంత త్వరగా పరిష్కరించడం వంటివి కూడా ఈ ఆదేశాల్లో ఉన్నాయి. ఈ తనిఖీల నివేదికలను ఎప్పటికప్పుడు డీజీసీఏకు సమర్పించాలని ఎయిర్ ఇండియాకు స్పష్టం చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa