ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమాన ప్రమాదంపై స్పందించిన అధికారులు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 08:01 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రయాణికుల బంధువులకు సమాచారం అందించడంలో తీవ్ర జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సిన చోట ప్రయాణికుల్లో చాలామంది తమ సొంత నెంబరే పేర్కొన్నారని వెల్లడించారు. దీంతో ప్రమాద సమాచారాన్ని ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులకు చేరవేయడంలో ఆలస్యం జరిగిందన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషాద వార్తను ప్రయాణికుల ఆత్మీయులకు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ విషయంలో ప్రయాణికులు నిర్లక్ష్యం వహించడంతో అధికారులకు ఊహించని సవాలు ఎదురైంది. ప్రయాణికులలో 70 శాతం మంది తమ సొంత నెంబర్లనే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లుగా పేర్కొనడంతో తాము ఫోన్ చేసినపుడు స్విచ్ ఆఫ్ వచ్చాయని అహ్మదాబాద్ విమానాశ్రయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ప్రమాదంలో ఫోన్లు ధ్వంసం కావడంతో, వారి కుటుంబ సభ్యులను తక్షణమే సంప్రదించడం కష్టంగా మారిందని వివరించారు. చాలా కుటుంబాలు ప్రమాద వార్త తెలుసుకుని స్వయంగా ముందుకు రాగా, మిగిలిన వారిని గుర్తించడానికి స్థానిక యంత్రాంగం సహాయం తీసుకున్నామని సదరు అధికారి పేర్కొన్నారు. కలెక్టర్ల ద్వారా ప్రయాణికులు ఇచ్చిన చిరునామాలకు వెళ్లి వారి బంధువులకు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా, డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా ఇప్పటివరకు 80 మంది మృతదేహాలను గుర్తించామని, అందులో 33 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa