ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు మాపై అణుబాంబు వేస్తే పాక్ మీపై న్యూక్లియర్ దాడి చేస్తుంది..: ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు

international |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 08:42 PM

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఇరాన్‌కు చెందిన ఒక ఉన్నత స్థాయి జనరల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మాజీ చీఫ్, ఎక్స్‌పెడియన్సీ డిసర్న్‌మెంట్ కౌన్సిల్ కార్యదర్శి అయిన జనరల్ మొహ్సేన్ రెజాయీ.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణు ఆయుధాలను ప్రయోగిస్తే పాకిస్థాన్ ప్రతిదాడులకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ తరఫున పాక్ ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుండగా.. పాక్ స్పందించింది.


ఇరాన్ ప్రభుత్వ అధీనంలోని ఓ టెలివిజన్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహ్సేన్ రెజాయీ సంచలన కామెంట్లు చేశారు. ఇజ్రాయెల్ తమపై అణుదాడి చేస్తే.. ఇస్లామాబాద్ కూడా టెల్‌అవీవ్‌పై అణుబాంబును ప్రయోగిస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించి పాక్ నుంచి తమకు హామీ లభించిందని చెప్పారు. అంతేకాకుండా తుర్కియే, సౌదీ, పాకిస్థాన్ సహా ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని కూడా అన్నారు. అయితే ఆయా దేశాలు మాత్రం ఇరాన్ యూనిఫాం వేసుకోవడానికి సిద్ధంగా లేవని పేర్కొన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే.. రాత్రికి రాత్రే ప్రాంతీయ బలగాలు మారిపోతాయని వివరించారు.


ముఖ్యంగా ఇస్లామిక్ ప్రపంచం ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య క్షిపణి దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే జనరల్ రెజాయీ చేసిన ఈ కామెంట్లపై తాజాగా పాకిస్థాన్ స్పందించింది. ముఖ్యంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తామని ఇస్లామాబాద్.. ఇరాన్‌కు ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఇజ్రాయెల్‌తో జరుగుతున్న విస్తృత వివాదంలో పాకిస్థాన్ ఇరాన్‌కు మద్దతు ఇస్తుందని, ముస్లిం ఐక్యతకు పిలుపునిస్తుందని పునరుద్ఘాటించారు.


టెహ్రాన్‌పై దాడి తర్వాత పాకిస్థాన్.. ఇరాన్ వెంట నిలబెడతుందని బహిరంగంగానే ప్రకటన చేసింది. యూదు దేశమైన ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ముస్లిం ఐక్యతకు పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్, పాకిస్థాన్ రెండూ అణు ఆయుధాలు కలిగిన దేశాలు కావడంతో.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తుండగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న అస్థిరతకు.. ఈ అణు బెదిరింపు బెదిరింపు వ్యాఖ్యలు మరింత అలజడి రేపుతున్నాయి. ఇలాంటి సమయంలోనే పరిస్థితిని చక్కదిద్దాలని, శాంతియుత పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని అంతర్జాతీయ సమాజం పిలుపునిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa