ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు

sports |  Suryaa Desk  | Published : Sat, Jul 12, 2025, 07:38 PM

లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేశాడు. అయితే సరిగ్గా 100 పరుగులు చేసిన రాహుల్... ఇంగ్లండ్ కుర్ర స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో హ్యారీ బ్రూక్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 101 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (24 బ్యాటింగ్), నితీశ్ కుమార్ రెడ్డి (11 బ్యాటింగ్) ఆడుతున్నారు. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ విషయానికొస్తే ఓపెనర్ యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 16, రిషబ్ పంత్ 74 పరుగులు చేశారు. సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 177 బంతుల్లో 13 ఫోర్లతో 100 పరుగులు చేసి అవుటయ్యాడు. పంత్ 112 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 74 పరుగులు చేసి లంచ్ కు ముందు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 1, ఆర్చర్ 1, కెప్టెన్ బెన్ స్టోక్స్ 1, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa