అవినీతి చేసి వచ్చిన లంచాలను పంచుకోవడంలో గొడవ పడిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సీజ్ చేసిన వాహనాలను తక్కువ ధరకు అమ్ముకున్న కానిస్టేబుల్లు.. వాటి నుంచి వచ్చిన డబ్బులను పంచుకునేవారు. అయితే ఓ రూ.500 పంపకాల్లో తలెత్తిన వివాదం.. వారి బండారాన్ని బయటపెట్టింది. ఆ రూ.500 కోసం వారిద్దరూ గొడవపెట్టుకోవడంతో.. ఈ విషయం కాస్తా బయటికి వచ్చింది. నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ల లంచాల ఘటనను సీరియస్గా తీసుకున్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.. స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి.. ఆ ఇద్దరు కానిస్టేబుల్ల అవినీతి చిట్టాను విప్పనున్నారు.
పోలీసులు రోడ్లపై తనిఖీలు చేపట్టి.. సరైన పత్రాలు లేని వాహనాలు, యాక్సిడెంట్లు అయిన వాహనాలను సాధారణంగా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉంటారు. అలాంటి వాహనాలు.. చాలా ఏళ్ల పాటు అలాగే ఉండి తుప్పుపట్టిపోతూ ఉంటాయి. అయితే తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్లుగా పనిచేసే ఎండీ వసీమ్, ఉపేందర్.. పోలీస్ స్టేషన్లో ఉంచిన వాహనాలను.. తక్కువ ధరలకు బయటి వ్యక్తులకు విక్రయించేవారు. అలా వచ్చిన డబ్బును గుట్టుచప్పుడు కాకుండా వసీమ్, ఉపేందర్ ఇద్దరూ పంచుకునేవారు. ఇలాగే ఇటీవల కూడా ఓ వాహనాన్ని విక్రయించగా.. కొంత డబ్బు వచ్చింది. దాన్ని పంచుకునే క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి.
వచ్చిన వాటాలను పంచుకోవడంలో వషీమ్, ఉపేందర్ మధ్య వివాదం తలెత్తింది. అయితే వారిద్దరి మధ్య రూ.500 విషయంలో ఎటూ తేలకపోవడంతో ఈ విషయం కాస్తా బయటికి వచ్చింది. ఈ ఘటనను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్గా తీసుకున్నారు. ఆ అవినీతిపై స్పెషల్ టీమ్తో విచారణ జరిపిస్తున్నారు. ఈ విచారణలో కానిస్టేబుల్లు వసీమ్, ఉపేందర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వసీమ్, ఉపేందర్ కేవలం స్టేషన్లోని వాహనాలను అమ్ముకోవడం మాత్రమే కాకుండా మరిన్ని విస్తుపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. స్టేషన్ పరిధిలో వచ్చే కేసులను సెటిల్మెంట్ చేస్తానంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తిప్పర్తి పోలీస్ స్టేషన్లో గతంలో పనిచేసిన అధికారుల వీక్నెస్లతో కానిస్టేబుల్ వసీమ్.. పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వసీమ్, ఉపేందర్ వ్యవహారంలో విచారణ జరుగుతోంది. వీరిద్దరినీ ఎస్పీ శరత్ చంద్ర పవార్ సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఎస్పీ శరత్ చంద్ర హెచ్చరికలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa