అప్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రషీద్ పెద్దన్న హాజీ అబ్దుల్ హలీం షిన్వారీ ఇటీవల కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే అప్ఘనిస్తాన్ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా సంతాపం తెలిపారు. అఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జాద్రాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా “అన్న అనేది కుటుంబానికి తండ్రి లాంటి వాడు. రషీద్ ఖాన్ కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజియూన్” అని పోస్ట్ చేశాడు. మాజీ కెప్టెన్ అస్గర్ అప్ఘాన్ కూడా స్పందిస్తూ “అల్లాహ్ ఆయనకు జన్నత్ అల్-ఫిర్దౌస్ ప్రసాదించి, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి” అని ప్రార్థించారు.
ఈ విషాద ఘటన చోటుచేసుకున్న రోజే పాకిస్తాన్ - అప్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ట్రై నేషన్ టీ20 సిరీస్ తొలి మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టు రషీద్ ఖాన్ పెద్దన్నకు గౌరవప్రదంగా నివాళి అర్పించింది. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆరంభంలో పాకిస్తాన్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. ఆఖరి వరకూ క్రీజులో నిల్చొని జట్టుకి మంచి స్కోర్ని అందించాడు. సల్మాన్ ఆఘా 36 బంతుల్లో 53 పరుగులు చేయగా, ఆఖర్లో మహమ్మద్ నవాజ్ 11 బంతుల్లో 21 పరుగులతో రాణించాడు.
పాకిస్తాన్ ఇచ్చిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘనిస్తాన్ జట్టు దారుణంగా విఫలమైంది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ను అవుట్ చేయగా, మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ 38 పరుగులు చేసి నవాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఒకానొక దశలో 93/2గా ఉన్న అప్ఘన్ జట్టు 97/7కి ఒక్కసారిగా కూలిపోయింది. హారీశ్ రౌఫ్ డబుల్ వికెట్ మేడిన్తో మ్యాచ్ పాక్ వైపునకు వెళ్లింది. ఆఖర్లో రషీద్ ఖాన్ 16 బంతుల్లో 39 పరుగులు చేసినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. 19.5 ఓవర్లకు 143 పరుగులకు అప్ఘన్ ఆలౌట్ అవడంతో పాకిస్తాన్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa