ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌కు "అభిషేక్ శర్మ" భయం: షోయబ్ మాలిక్ ఏమన్నారంటే!

sports |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 07:18 PM

క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఒక యుద్ధంలా భావిస్తారు అభిమానులు. అటువంటి ఉత్కంఠభరిత మ్యాచ్ కోసం ఈ రెండు దేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. ఈ కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌లో భారత జట్టు దూకుడైన ఆటతీరుపై తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రత్యేకించి యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరు ఇప్పుడు పాక్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
యూఏఈతో జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 27 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ విజయం కంటే ఎక్కువగా అభిషేక్ శర్మ దూకుడు చర్చకు దారితీసింది. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్.. తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసినప్పటికీ, అతని ప్రతి షాట్ పాక్ బౌలర్లకు ఒక హెచ్చరికలా కనిపించింది. పాకిస్థాన్‌లోని పలు టీవీ షోలలో మాజీ క్రికెటర్లు అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి చర్చించుకోవడం, భారత జట్టు దూకుడును చూసి ఆందోళన చెందడం ఆశ్చర్యపరిచింది.
ఒక పాకిస్థాన్ టీవీ షోలో యాంకర్.. "టీమిండియా అంటే భయపడుతున్నారా?" అని ప్రశ్నించేంతగా అక్కడ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో షోలో పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ దూకుడుకు కారణాన్ని విశ్లేషించారు. ఒక ఆటగాడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అందుకే భారత జట్టు యువ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టగలుగుతుందని మాలిక్ వివరించారు. రెండు మ్యాచ్‌లు విఫలమైతే మూడో మ్యాచ్‌లో ఉంటాడో లేదో తెలియని పరిస్థితిలో ఆటగాడు ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడలేడని మాలిక్ తమ దేశ జట్టును పరోక్షంగా విమర్శించారు.
భారత్లో ఆటగాళ్లకు వారి స్థానం గురించి భయం ఉండదని, అందుకే వారు స్వేచ్ఛగా, దూకుడుగా ఆడగలుగుతున్నారని మాలిక్ పేర్కొన్నారు. పాకిస్థాన్లో ప్రతిభ ఉన్నా, ఆటగాళ్లు తమ స్థానం గురించి ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురవుతారని, ఇది వారి ఆటతీరుపై ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ జట్టు వ్యవస్థలో చాలా మార్పులు రావాలని, యువకులకు ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం కల్పించాలని షోయబ్ మాలిక్ గట్టిగా నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa