విజయవాడలో డయేరియా కేసులు ప్రబలిన నేపథ్యంలో ఐదు రోజులుగా బాధితుల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాడుతోంది . వారికి సరైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డయేరియా పై అయన స్పందిస్తూ... ఈ రోజుకీ కారణాలను చెప్పడానికి ప్రభుత్వానికి ధైర్యం చాలడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి ఆదేశాలతో డాక్టర్లతో కూడిన వైయస్ఆర్సీపీ నాయకుల బృందం న్యూ రాజరాజేశ్వరీ పేటలో పర్యటించడం జరిగింది. కాలనీలో పర్యటిస్తుంటే బాధితుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికీ ఎన్యుమరేషన్ పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఒక కాలనీలో ప్రబలిన డయేరియా కేసుల్ని నియంత్రణ చేయలేకపోయిన ప్రభుత్వం రానున్న దసరా ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నా మెడికల్ క్యాంపులో పిల్లల డాక్టర్లను పెట్టలేదు. కనీసం అంబులెన్స్ సదుపాయాలు కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. వైద్యారోగ్యశాఖ మంత్రి అవగాహన లేకుండా బుడమేరు గురించి మాట్లాడుతూ ప్రజల్ని మరింత భయాందోళనకు గురిచేస్తున్నారు. ప్రజల నుంచి ఆస్తి పన్ను వసూలు చేయడంలో చూపించే శ్రద్ద వారికి సురక్షిత మంచినీరు సరఫరా, పారిశుధ్య నిర్వహణలో కనిపించడం లేదు. పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ గత మూడు రోజుల్లోనే 700 లకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఐదు రోజుల తర్వాత కూడా ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా సరఫరా చేసే నీరు కూడా బురదమయంగా ఉంటోందంటే తాగునీటి సరఫరాలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పనవసరం లేదు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి సత్యకుమార్ తక్షనం రాజీనామా చేయాలి. ఇప్పటికైనా ప్రజలందరికీ సురక్షిత మంచినీటిని ఉచితంగా సరఫరా చేయాలి. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే వైయస్ఆర్సీపీ తరఫున గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa