ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజురోజుకి మహిళలు తమ శక్తి సామర్ధ్యాలని చాటుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 01:19 PM

దేశంలో మహిళా శక్తి నానాటికీ పురోగమిస్తోందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. అనేక రంగాల్లో వారు తమ ప్రతిభను చాటుతున్నారని, ఆడబిడ్డలు విద్యావంతులై, స్వావలంబన సాధించినపుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అప్పుడే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. తిరుపతిలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్లమెంటరీ, అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు పార్లమెంటు సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. మహిళల నేతృత్వంలో సాధించే అభివృద్ధి, చిన్నారుల సంక్షేమాలే ‘వికసిత్‌ భారత్‌’ విధానాలకు పునాదులవుతాయని తెలిపారు. ‘నారీ శక్తి వందన్‌’ చట్టమనేది కేవలం ప్రాతినిధ్యం కోసమే కాదని, ప్రజాస్వామ్యంలో మహిళలకు తగినస్థానం కల్పించే దిశగా ఆ చట్టం ఓ చరిత్రాత్మక ముందడుగని అభివర్ణించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. మహిళా సాధికారత అనేది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియగా పేర్కొన్నారు. దీనికోసం కొత్త చట్టాలు, విధానపరమైన సంస్కరణలు జరుగుతూనే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీతోపాటు దేశంలోని 20కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల మహిళా కమిటీల సభ్యులు హాజరయ్యారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa