ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెలబ్రిటీలు చట్టానికి అతీతులు కాదు.. యూసుఫ్ పఠాన్‌ను అక్రమణదారుడిగా ప్రకటించిన హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 07:01 PM

ఓ ప్రభుత్వం స్థల వివాదం కేసులో టీమిండియా మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్‌కు గుజరాత్ హైకోర్టు షాకిచ్చింది. వడోదరలో ప్రభుత్వ భూమిని ఆయన ఆక్రమించారని పేర్కొన్న న్యాయస్థానం.. వివాదాస్పద స్థలాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, సెలబ్రిటీలు చట్టాలకు అతీతులు కాదని, వారికి మినహాయింపు ఇవ్వడం తప్పుడు సంకేతాలు పంపుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ మోనా భట్ ఏకసభ్య ధర్మాసనం తీరు వెలువరించింది. వడోదర తండల్జా ప్రాంతంలోని తన బంగ్లాకు ఆనుకుని ఉన్న స్థలాన్ని తన నియంత్రణలోనే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలంటూ యూసఫ్ పఠాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ సింగిల్ జడ్జి బెంచ్ గత నెలలో తీర్పు చెప్పింది.


చట్టపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఇవ్వడం వల్ల సమాజానికి తప్పుడు సందేశాలు వెళ్తుందని, చట్టబద్దమైన పాలన దెబ్బతింటుందన్న సుప్రీంకోర్టు సూత్రాలను హైకోర్టు ఉదహరించింది. ‘జాతీయ ప్రతినిధి, పబ్లిక్ ఫిగర్ అయిన యూసఫ్ పఠాన్‌కు చట్టాన్ని అనుసరించాల్సిన బాధ్యత మరింత ఎక్కువ... ప్రముఖలు సమాజ ప్రవర్థన, విలువలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతారు.. అలాంటి వ్యక్తులు చట్టాన్ని ఉల్లఘించినప్పటికీ వారికి మినహాయింపు ఇవ్వడం సమాజానికి తప్పుడు సందేశం పంపుతుంది.. అదే విధంగా ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని ధర్మాసనం పేర్కొంది.


కాగా, యూసఫ్ పఠాన్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని పేర్కొంటూ. 2012లో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఆయనకు నోటీసులు జారీచేసింది. తక్షణమే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని తెలిపింది. ఈ నోటీసులను పఠాన్ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. తన కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ స్థలాన్ని తాను, తన సోదరుడు ఇర్ఫాన్ పఠాన్‌లు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్ధించారు. అలాగే, తాను గుజరాత్ ముఖ్యమంత్రిని కూడా స్థలం కొనుగోలుకు అనుమతించాలని అభ్యర్ధించినట్టు పేర్కొన్నారు. ఆయన అభ్యర్థనను మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. అయితే, 2014లో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. అయినా కానీ, ఆ స్థలాన్ని యూసఫ్ పఠాన్ కుటుంబం ఖాళీచేయకుండానే.. న్యాయస్థానంలో పోరాటం సాగించింది. కానీ, హైకోర్టు తీర్పుతో వారికి ఎదురుదెబ్బ తగిలింది.


ఇక, యూసఫ్, ఇర్ఫాన్ పఠాన్ సోదరులు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. అన్నదమ్ములు ఇద్దరూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఎంతో మంది అభిమానులను వారు సంపాదించుకున్నారు. భారత్ 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఇద్దరూ ఉన్నారు. యూసఫ్ పఠాన్ గతేడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పశ్చిమ్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa