ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ బాల్యంపై సినిమా, ఛలో జీతే హై ప్రదర్శన

national |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 07:46 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే.. అన్ని రాష్ట్రాల బీజేపీ శాఖలు సర్వం సిద్ధం చేశాయి. ఇక మరికొన్ని రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే.. ఆ రాష్ట్రంలో మరింత ఎక్కువగానే ప్రధాని మోదీ బర్త్ డే వేడుకలను జరిపేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ బాల్యంపై తీసిన ' ఛలో జీతే హై ' సినిమాను బిహార్ వ్యాప్తంగా ప్రదర్శించేందుకు కమలం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. బిహార్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 'ఛలో జీతే హై' సినిమాను ప్రజలకు ప్రదర్శించనున్నారు.


సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలోనే బిహార్‌లోని 243 నియోజకవర్గాల్లో ‘ఛలో జీతే హై’ పేరిట ఆయన బాల్యంపై తీసిన సినిమాని ప్రదర్శించనుంది. మరోవైపు.. ‘సేవా పఖ్వాడా’ పేరుతో 2 వారాల పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహించనుంది. రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన విజయాలను ప్రజలందరికీ తెలియజేసేలా వినూత్న కార్యక్రమాలను చేపట్టనున్నారు.


ఈ నేపథ్యంలోనే బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఛలో జీతే హై సినిమాను ప్రదర్శించేందుకు 243 వాహనాలను ఇప్పటికే బీజేపీ నేతలు సిద్ధం చేశారు. ఆ వాహనాలకు పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. బిహార్ రాజధాని పాట్నాలో మంగళవారం రోజున కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్‌.. ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛలో జీతే హై కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. నరేంద్ర మోదీ చిన్ననాటి జీవితంలో చూసిన వాస్తవాలని పేర్కొన్నారు. మోదీ పేదరికాన్ని అనుభవించారని.. బాల్యంలో తన తల్లిపడిన కష్టాలను చాలా దగ్గరి నుంచి చూశారని.. అందుకే నరేంద్ర మోదీకి పేదలు అనుభవించే బాధ తెలుసని కేంద్రమంత్రి వెల్లడించారు.


ఇక 2018లో విడుదలైన ఈ షార్ట్ ఫిల్మ్ ‘ఛలో జీతే హై’ సినిమాకు మంగేశ్‌ హడవాలే దర్శకత్వం వహించారు. మన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించేవారు మాత్రమే అసలైన జీవితాన్ని జీవిస్తారంటూ స్వామి వివేకానంద చెప్పిన సూక్తిని ఆధారంగా తీసుకున్న ఒక బాలుడి గురించి ఈ ఛలో జీతే హై సినిమాలో ప్రస్తావించారు. ఇక బెస్ట్ నాన్‌ ఫీచర్ ఫిల్మ్‌గా ఈ సినిమా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. నరేంద్ర మోదీ చిన్ననాటి జీవితాన్ని ఆధారంగా చేసుకుని.. ఈ సినిమా కథను రూపొందించారు. ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఇప్పటికే ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa