రాబోయే బిహార్ ఎన్నికల్లో తాము ఆరు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇండియా కూటమిలో చేరాలని కోరుతూ మూడు లేఖలు రాసినా తమను పట్టించుకోలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తమ పార్టీని బీజేపీకి చెందిన ‘బి-టీమ్’గా ముద్ర వేస్తున్నారని చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. తమ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకత్వాన్ని చాలా సార్లు సంప్రదించినా.. వారికి ఏమాత్రం సానుకూల స్పందన రాలేదని ఒవైసీ పేర్కొన్నారు.
తాము బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు. తమ పార్టీ బిహార్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్.. లాలూ ప్రసాద్ యాదవ్కు రెండు లేఖలు, చివరగా తేజస్వి యాదవ్కు ఒక లేఖ రాశారని ఒవైసీ పేర్కొన్నారు. ఆ లేఖల్లో తాము ఆరు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవులు కూడా అవసరం లేదని చెప్పినట్లు వివరించారు. కేవలం సీమాంచల్ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తే చాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇంతకంటే మేము ఏం చేయగలం అని ఒవైసీ ప్రశ్నించారు.
2020 బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలు గెలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఆ తర్వాత ఆ ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఆర్జేడీ పార్టీలోకి ఫిరాయించారు. ఈ విషయంపై ఒవైసీ మాట్లాడుతూ.. తమను ‘బీజేపీ బి-టీమ్’గా ఆరోపిస్తున్న ఆర్జేడీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా నలుగురు ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఏమీ జరగలేదు. కానీ బీజేపీ శివసేన ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మాత్రం అంతా అల్లకల్లోలం అయింది” అని ఆయన విమర్శించారు.
గత వారం ఎంఐఎం బిహార్ యూనిట్కు చెందిన నాయకులు.. ఆర్జేడీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా వారు లాలూ యాదవ్ ఇంటికి వెళ్లి అక్కడ డప్పులు కొడుతూ, పోస్టర్లను ప్రదర్శించారు. ఎంఐఎం ఇండియా కూటమిలో చేరడానికి పలుమార్లు ప్రయత్నించిందని అఖ్తరుల్ ఇమాన్ కూడా స్పష్టం చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యేల ద్వారా కూడా తాము సందేశం పంపామని.. కానీ తమకు వచ్చిన సలహా ఈసారి ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పినట్లు వెల్లడించారు. అయినప్పటికీ తమతో విడిపోయిన పార్టీతో కూడా పొత్తుకు తాము సిద్ధంమేనని ఒవైసీ స్పష్టం చేశారు.
బిహార్ ఎన్నికల వ్యూహంతో పాటు పాకిస్థాన్తో ఆసియా కప్ మ్యాచ్ను ఆడేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిన నిర్ణయాన్ని కూడా ఒవైసీ తీవ్రంగా ప్రశ్నించారు. “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాని అన్నారు. కానీ క్రికెట్ మ్యాచ్ మాత్రం ఆడవచ్చా? ఇది పాకిస్థాన్కు ఎలాంటి సందేశాన్ని పంపుతుంది? పాకిస్థాన్ మారుతుందని మీరు అనుకుంటున్నారా? అలా అనుకునే వారు తెలివితక్కువ వారు” అని ఒవైసీ అన్నారు. క్రికెటర్లతో తమకు ఎలాంటి విరోధం లేదని, తమకు వారిపై ఎప్పుడూ గర్వంగా ఉంటుందని తెలిపారు. అయితే భారత ప్రభుత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. భారతదేశం క్రికెట్ మ్యాచ్లను గెలవడమే కాకుండా.. ఉగ్రవాదంపై పోరాటంలో కూడా గెలవాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa