ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైనిక దుస్తుల్లో వచ్చి మరీ రూ.21 కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన దొంగలు

Crime |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 08:42 PM

సినిమాను తలపించేలా జరిగిన ఒక భారీ బ్యాంకు దోపిడీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సైనిక దుస్తులు ధరించి, ముఖానికి ముసుగులు వేసుకున్న ముగ్గురు దొంగల ముఠా మంగళవారం సాయంత్రం కర్ణాటకలోని చడచణ్ పట్టణంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలోకి ప్రవేశించింది. తుపాకులతో బ్యాంకులోకి దూసుకెళ్లిన దుండగలు.. సిబ్బందిని బెదిరించి రూ. 20 కోట్లు విలువైన 20 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 1 కోటి నగదును దోచుకెళ్లారు.


దోపిడీదారులు ముందుగా బ్యాంకులో ఉన్న సిబ్బందిని, మేనేజర్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతులను, కాళ్లను ప్లాస్టిక్ సంచులు, ఇతర వస్తువులతో కట్టివేశారు. ఆ తర్వాత వారందరినీ బాత్రూంలోకి నెట్టి లోపలి నుంచి తాళం వేశారు. ఈ క్రమంలోనే మేనేజర్‌ను బెదిరించి.. నగదు నిల్వ ఉన్న గదిని (క్యాష్ వాల్ట్) తెరవమని అడిగారు. "నగదు తీయి, లేకపోతే నిన్ను చంపేస్తాను" అని వారిలో ఒకడు మేనేజర్‌ను బెదిరించగా.. గత్యంతరం లేక తెరిచారు. ఇలా అందులో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగలు తీసుకున్నారు. ఆ తర్వాత సిబ్బందిని బలవంతం చేసి బంగారు ఆభరణాలు ఉన్న లాకర్‌ను కూడా తెరిపించారు. ఆ తర్వాత దొంగలు తమతో తెచ్చుకున్న సంచుల్లో నగదు, వినియోగదారుల బంగారు ఆభరణాలను నింపుకుని పారిపోయారు.


దోపిడీ తర్వాత ఈ ముఠా నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఒక వ్యాన్‌లో సంఘటనా స్థలం నుంచి మహారాష్ట్రలోని పండర్‌పూర్ వైపు పారిపోయారు. అయితే వారు సోలాపూర్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో స్థానికులతో వారికి వాదనలు పెరిగాయి. కానీ తమ వద్ద డబ్బు, నగలు ఉండడం పోలీసులకు దొరికితే ప్రమాదం అవుతుందని భావించిన చోరులు వాహనాన్ని అక్కడే వదిలేసి డబ్బు, నగలు తీసుకుని వెంటనే వెళ్లిపోయారు. విజయపుర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ నింబర్గి ఈ సంఘటనపై స్పందిస్తూ.. "నిందితులు నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఒక ఎకో వాహనాన్ని ఉపయోగించి ఈ నేరానికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంతో ప్రమాదం జరిగిన తర్వాత వాహనాన్ని అక్కడే వదిలేసి దోచుకున్న నగదు, ఆభరణాలతో సంఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు" అని తెలిపారు.


ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే.. చడచణ్ పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ నింబర్గి సీనియర్ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను పట్టుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, దొంగల కదలికల ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa