ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తాన్ .. ఇప్పుడు సొంత ప్రజలపైనే బాంబులు కురిపించడం.. ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉగ్రవాద గ్రూపులు తలదాచుకోగా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత మరిన్ని ఉగ్ర సంస్థలు కూడా ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో ఉండే ఈ ప్రావిన్స్కు తరలివెళ్లడం పెరిగిపోతున్న నేపథ్యంలో.. వారిపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ ప్రయత్నాలు చేయగా.. అది కాస్తా ఫెయిల్ అయి.. సాధారణ జనాలపై బాంబులు వేసినట్లు తెలుస్తోంది. ఈ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 30 మంది పౌరులు చనిపోయారు. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చనిపోయిన వారిలో పిల్లలు, మహిళలు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని జొన్నగిరి గ్రామానికి సమీపంలోని తిరాహ్ లోయలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు 8 ఎల్ఎస్-6 బాంబులను ఆ గ్రామంపై జారవిడిచినట్లు తెలుస్తోంది. తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినప్పటికీ.. గ్రామంపై బాంబులు పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించిందని.. గాయపడిన వారి సంఖ్య మరింత అధికంగా ఉందని తెలుస్తోంది. ఇక సంఘటనా స్థలానికి సంబధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అవి చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
పాకిస్తాన్ చేసిన బాంబు దాడులపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పౌరుల ప్రాణాలను లెక్కచేయకుండా డ్రోన్ దాడులు జరుగుతున్నాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతంలోనే పేర్కొంది. ఈ ఏడాది జూన్లో జరిగిన ఒక డ్రోన్ దాడిలో ఒక చిన్నారి చనిపోయిందని.. అప్పటినుంచి ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయని తెలిపింది.
మరోవైపు.. ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగస్ట్ వరకు అక్కడ మొత్తం 605 ఘటనలు చోటు చేసుకోగా.. అందులో 138 మంది పౌరులు, 79 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని నెలల క్రితం పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రసంస్థలు తమ కొత్త స్థావరాలను ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఏర్పాటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో పర్వతాలు ఉండటం.. ఉగ్రవాదులకు అడ్డాగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa