ఖలీస్థాన్ ఉగ్రవాది , సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ముఖ్య అనుచరుడ్ని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలీస్థాన్ పేరుతో కెనడాలో ఎస్ఎఫ్జే కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఇంద్రజీత్ సింగ్ గోసల్ను ఒట్టావాలో అదుపులోకి తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. పన్నూ సన్నిహితుడిగా ముద్రుపడి ఇంద్రజీత్... హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అనంతరం 2023 నుంచి కెనడాలో సిఖ్స్ ఫర్ జస్టిస్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నాడు. అక్రమ ఆయుధాలు సహా పలు అభియోగాలపై గోసల్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, టొరంటో బ్రాంప్టన్లోని ఓ హిందూ ఆలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఉన్న ఖలీస్థాన్ ఉగ్రవాది ఇంద్రజీత్ గోసల్ గత నవంబర్లోనూ అరెస్టయ్యాడు. అయితే, కండిషన్ బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు.
కాగా, ఖలీస్థాన్ ఉగ్రవాదులకు తమ దేశం నుంచే ఆర్థిక సహకారం అందుతోందని స్వయంగా కెనడా ఇంటెలిజెన్స్ నివేదిక ఇటీవల అంగీకరించింది. నిషేధిత ఉగ్రవాద సమూహాలు భారత్లో భద్రతను ప్రభావితం చేసేలా పనిచేస్తున్నట్టు ఆ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా, ఖలీస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య అనంతరం కెనడా, భారత్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో భారత్పై ఆరోపణలు చేయడంతో దౌత్య యుద్ధం మొదలైంది.
ఇటీవల భారత్,కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించేలా ఒప్పందం కుదిరినట్టు విదేశాంగ ప్రకటించింది. ఇందులో భాగంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను నియంత్రించేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గోసల్ను అరెస్ట్ చేయడం గమనార్హం. ఇక, భారత్, కెనడాలు ఏడాదిన్నర అనంతరం రాయబారులను తిరిగి నియమించుకున్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్దరణే లక్ష్యంగా భారత్, కెనడా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, నథాలీ డ్రౌయిన్ల మధ్య చర్చలు జరిగాయి. జూన్లో కెనడా వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa