విదేశీ టెక్ నిపుణులను ఆకర్షించేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్టీఈఎం) వంటి రంగాల్లో ప్రతిభావంతులైన యువ నిపుణులను ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించడానికి కొత్తగా "కే-వీసా"ను ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించింది. గత ఆగస్టులోనే ఆమోదం పొందిన ఈ వీసాకు సంబంధించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
అమెరికాలో హెచ్-1బీ వీసాపై నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య చైనా తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ దరఖాస్తుదారులపై ఒక లక్ష డాలర్ల (సుమారు రూ. 88 లక్షలు) వార్షిక రుసుమును విధించడంతో భారతీయ టెక్ నిపుణులు, ఐటీ కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే చైనా సరళీకృత వీసా విధానం దక్షిణాసియా దేశాల నుంచి, ముఖ్యంగా భారతదేశం నుంచి వృత్తి నిపుణులను ఆకర్షించే ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
చైనా న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. చైనా లేదా విదేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి ఎస్టీఈఎం రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత సాధించిన యువ శాస్త్రీయ, సాంకేతిక ప్రతిభావంతులకు ఈ కే-వీసా అందుబాటులో ఉంటుంది. అలాగే అలాంటి సంస్థల్లో బోధన, పరిశోధనలో నిమగ్నమైన యువ నిపుణులు కూడా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు చైనా అధికారులు నిర్దేశించిన అర్హతలను, అవసరాలను తప్పనిసరిగా నెరవేర్చాలి. వారు తమ విద్యా అర్హతలు, వృత్తిపరమైన లేదా పరిశోధనా అనుభవానికి సంబంధించిన పత్రాలను అందించాల్సి ఉంటుంది.
'కే-వీసా' ప్రత్యేకతలు
చైనాలో ప్రస్తుతం ఉన్న 12 సాధారణ వీసా కేటగిరీలతో పోలిస్తే.. కే-వీసా అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బహుళ ప్రవేశాలు, సుదీర్ఘ కాల పరిమితి అలాగే దేశంలో ఎక్కువ కాలం ఉండే సౌలభ్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. అనేక రకాల వర్క్ వీసాల మాదిరిగా కాకుండా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి చైనాలో పనిచేసే ఒక సంస్థ నుంచి ఆహ్వానం అవసరం లేదు. ఇలా ఇది ప్రక్రియను మరింత సరళంగా మారుస్తుంది. చైనాలో ప్రవేశించిన తర్వాత కే-వీసా హోల్డర్లు వ్యాపార కార్యకలాపాలతో పాటు విద్య, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ వంటి రంగాలలో కూడా పాల్గొనడానికి అనుమతిస్తారు. నిర్దిష్ట వయస్సు, విద్య, పని అనుభవానికి సంబంధించిన అర్హతలు ఉన్నవారికి ఆహ్వానం లేకుండానే దరఖాస్తు ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారిక ప్రకటన తెలిపింది.
ఈ కొత్త వీసా విధానం అంతర్జాతీయ మార్పిడికి చైనాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి బీజింగ్ చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగం. గత కొన్ని సంవత్సరాలుగా చైనా తన ప్రవేశ నిబంధనలను సులభతరం చేస్తూ.. వీసా రహిత ప్రయాణ అవకాశాలను పెంచుతోంది. అధికారిక డేటా ప్రకారం.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 38.05 మిలియన్ల మంది విదేశీయులు చైనాను సందర్శించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 30.2 శాతం పెరిగింది. ఈ ప్రయాణాల్లో 13.64 మిలియన్లు వీసా రహిత ప్రవేశాలు కావడం విశేషం.
హెచ్-1బీ సంక్షోభం వేళ చైనా తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణాసియా నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అధిక ఖర్చు, సుదీర్ఘ ప్రక్రియ వంటి సమస్యలు లేకుండా విదేశాల్లో అవకాశాలు వెతుక్కుంటున్న వారికి ఈ వీసా ఒక గొప్ప అవకాశం కల్పించవచ్చని వారు భావిస్తున్నారు. అయితే కే-వీసా అమెరికా, ఐరోపా దేశాల సాంప్రదాయ కీర్తిని, కెరీర్ అవకాశాలను అందుకోగలదా లేదా అనేది కాలమే చెప్పాలి. కానీ, ప్రస్తుతానికి ఇది అంతర్జాతీయ అవకాశాల కోసం చూస్తున్న యువ పరిశోధకులు, నిపుణులకు చైనా అందిస్తున్న ఒక ప్రత్యక్ష ఆఫర్గా పరిగణించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa