అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును అమాంతం పెంచుతూ చేసిన ప్రకటనతో తలెత్తిన గందరగోళంపై వైట్హౌస్ స్పష్టతనిచ్చింది. లక్ష డాలర్ల (సుమారు రూ. 88 లక్షలు) హెచ్-1బీ వీసా ఫీజు కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుందని.. అది కూడా ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పెంపు వీసా రెన్యువల్లకు, ప్రస్తుతం వీసా కలిగి ఉన్నవారికి వర్తించదని పేర్కొంది. మొదట అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఈ పెంచిన ఫీజును ప్రతి సంవత్సరం చెల్లించాలని.. అది కొత్త వీసాదారులతో పాటు రెన్యువల్లకు కూడా వర్తిస్తుందని శుక్రవారం ప్రకటించారు. దీనితో హెచ్-1బీ వీసాదారుల్లో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజు ఈ కొత్త విధానం అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందు వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆమె ప్రకటన ప్రకారం.. ఇది వార్షిక ఫీజు కాదని, ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, కొత్త వీసాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే ప్రస్తుతం హెచ్-1బీ వీసా కలిగి ఉండి విదేశాల్లో ఉన్నవారు అమెరికాలో తిరిగి అడుగు పెట్టేందుకు లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. వారు ఎప్పటిలాగే ప్రయాణాలు కొనసాగించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు అమెరికా కాలమానం ప్రకారం 21వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఉద్యోగుల్లో అయోమయం.. కంపెనీల అడ్వైజరీ
వైట్హౌస్ నుంచి వివరణ రాకముందు పలు అమెరికా టెక్ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు అత్యవసర సూచనలు జారీ చేశాయి. దేశం వదిలి ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లవద్దని, విదేశాల్లో ఉన్నవారు వెంటనే ఆదివారం డెడ్లైన్లోగా అమెరికాకు తిరిగి రావాలని అడ్వైజరీ జారీ చేశాయి. దీంతో హెచ్-1బీ వీసా కలిగిన వేలాదిమంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. శుక్రవారం అమెరికా నుంచి ఇతర దేశాలకు బయలుదేరిన కొందరు ఉద్యోగులు విమానాలు దిగిపోగా.. ఇతర దేశాల్లో ఉన్నవారు వెంటనే తిరిగి అమెరికా బయలుదేరారు.
అమెరికన్లకు బదులుగా తక్కువ వేతనానికి పని చేసే విదేశీ కార్మికులను తీసుకు వస్తున్నారని.. దీని వల్ల తమ దేశీయ నిరుద్యోగ సమస్య పెరిగిందని వైట్హౌస్ సమర్థించుకుంది. అందువల్లనే అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ఈ వీసా రుసుమును పెంచినట్లు వివరించింది. కొన్ని కంపెనీలు హెచ్-1బీ వర్కర్లను భారీగా నియమించుకుని.. వేలాది మంది అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తున్నాయని కూడా వైట్హౌస్ పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీ 5,189 హెచ్-1బీ వర్కర్లకు ఆమోదం పొంది.. 16,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని వివరించింది. అమెరికన్ల ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే ట్రంప్ లక్ష్యమని శ్వేతపత్రం స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా తయారీ రంగంలోని ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం కోరుకుంటోందని వివరించింది.
హెచ్-1బీ వీసా అనేది సైంటిస్టులు, ఇంజినీర్లు, ప్రోగ్రామర్లు, డాటా సైంటిస్టులు వంటి నిపుణులను అమెరికన్ కంపెనీలు నియమించుకోవడానికి ఉపయోగించే వీసా. ఈ వీసా కాలపరిమితి మూడేళ్లు కాగా.. ఆ తర్వాత దానిని ఆరేళ్ల వరకు పొడిగించవచ్చు. ప్రతి ఏటా అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాలలో దాదాపు 70 శాతం భారతీయులే పొందుతారు. రెండో స్థానంలో చైనా దేశీయులు ఉన్నారు. హెచ్-1బీ వీసాలపై వచ్చే ఉద్యోగుల్లో ఐటీ వర్కర్ల వాటా ఇటీవలి సంవత్సరాల్లో 65 శాతానికి పైగా పెరిగిందని వైట్హౌస్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa