ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ స్లీపర్ ట్రైన్ ,,,, డేట్ చెప్పేసిన కేంద్రమంత్రి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 08:29 PM

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది, డేట్ చెప్పేసిన కేంద్రమంత్రి(ఫోటోలు- Samayam Telugu)


దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలు ఎక్కనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ఒక కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఒక వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్స్, టెస్ట్‌లు పూర్తి చేసుకుని పరుగులు తీసేందుకు రెడీ అయిందని వెల్లడించారు. ఇక రెండో రైలును కూడా అక్టోబర్ 15వ తేదీ నాటికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాతే రెండింటినీ ఒకేసారి జాతికి అంకితం చేయనున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అయితే దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు .. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో పరుగులు తీయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


అయితే ఒకేసారి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించడానికి గల కారణాన్ని కూడా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు నిరంతరంగా ప్రయాణికులు సేవలు అందించాలంటే.. ఒక రైలు సరిపోదని.. అందుకు రెండు రైళ్లు అవసరం అవుతాయని చెప్పారు. అందుకే రెండో రైలు పూర్తి అయ్యేవరకు వేచి చూస్తున్నట్లు వివరించారు. రెండో రైలు అందుబాటులోకి వస్తే.. ఆ రైలును ఏ మార్గంలో నడపాలి, దాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయాలపై ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని అశ్వినీ వైష్ణవ్ తేల్చి చెప్పారు.


అయితే ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ-పాట్నా మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది.. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టం అవుతుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందున.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారి కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో పాటు, వేగవంతమైన ప్రయాణాన్ని రైలు ప్రయాణికులకు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కిస్తోంది.


ఈ సందర్భంగా.. పంజాబ్‌లో ప్రస్తుతం, భవిష్యత్‌లో రానున్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టుతో కలిసి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. పంజాబ్‌లో కొత్తగా రాజ్‌పురా-మొహాలి మధ్య 18 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది అంబాలా-అమృత్‌సర్ మార్గంలో చండీగఢ్‌కు మరింత దగ్గర మార్గం అవుతుందని వెల్లడించారు. దీంతో ప్రయాణ దూరం 66 కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పారు. మరోవైపు, న్యూఢిల్లీ-ఫిరోజ్‌పూర్ క్యాంట్ మధ్య కొత్త వందే భారత్ రైలును కూడా ప్రారంభించాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు తీసుకువచ్చింది. కేవలం 6 గంటల 40 నిమిషాల్లోనే ఈ రైలు 486 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa