బాంబే హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ పింఛను, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలకు ఎవరు అర్హులు అనేది తేల్చి చెప్పింది. సాధారణంగా భార్యాపిల్లలు ఉంటే వారికి వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే కాగా.. ఆమె నుంచి విడాకులు తీసుకున్నా, తీసుకుంటానని కోర్టులో కేసు పెట్టినా, నామినీగా భార్య పేరును తీసేసి వేరే వాళ్ల పేరు మార్చినా ఎవరికి వస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నా, ఆమె వ్యభిచారం చేసినట్లు నేరం నిరూపితం అయినప్పుడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో.. ముఖ్యంగా నామినీగా భర్త పేరును మార్చేసినా ఆమె, ఆమె పిల్లలకే పింఛన్, ఇతర ప్రయోజనాలు చెందుతుందని స్పష్టం చేసింది.
జస్టిస్ మనీష్ పితాలే, జస్టిస్ వైజీ ఖోబ్రాగడేతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేసు వివరాల ప్రకారం.. సదరు మహిళకు 1997లో వివాహమైంది. అయితే 2009లో ఆమె భర్త ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. అప్పటి వరకు వారి జీవితం సాఫీగానే సాగినా.. ఆ తర్వాతే గొడవలు ప్రారంభం అయ్యాయి. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నా.. భార్య ప్రవర్తన నచ్చని అతడు 2011లో భర్త తన భార్యపై విడాకుల కేసు వేశారు. కానీ ఆమె విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఏళ్లుగా ఈ కేసు కోర్టులోనే కొనసాగుతూ వస్తోంది. మరోవైపు ఈ కేసు కొనసాగుతున్న సమయంలోనే ఆ భర్త.. కుటుంబ పింఛను నామినీ వివరాలను ఏకపక్షంగా మార్చారు. తన భార్యకు బదులుగా తన సోదరుడి పేరును నామినీగా చేర్చారు. అయితే తన ఇద్దరు కుమారుల పేర్లను మాత్రం అలాగే ఉంచారు.
దురదృష్టవశాత్తు 2018లో ఆ భర్త మరణించగా.. అతని భార్య, పిల్లలు పింఛను ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ మృతుడి తల్లి, సోదరుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. చనిపోవడానికి నాలుగు సంవత్సరాల ముందే.. అతడు పింఛను నామినీగా భార్య పేరు స్థానంలో తన సోదరుడి పేరును చేర్చినట్లు నామినేషన్ పత్రాన్ని కోర్టు ముందు చూపించారు. అంతేకాకుండా విడాకుల కేసు, వివాహేతర సంబంధం ఆరోపణలను కూడా ప్రస్తావించారు.
దీనికి సమాధానంగా భార్య, పిల్లల తరపున వాదించిన న్యాయవాది యశోదీప్ దేశ్ముఖ్.. మహారాష్ట్ర సివిల్ సర్వీసెస్ (పింఛన్) నియమాలలోని రూల్ 115ను ఉదాహరించారు. ఆ నిబంధన ప్రకారం.. ఒక ప్రభుత్వ ఉద్యోగికి కుటుంబం ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులను నామినీగా నియమించకూడదు. ధర్మాసనం 'కుటుంబం' అనే పదాన్ని రూల్ 116 ప్రకారం నిర్వచించింది. ఈ నిర్వచనం ప్రకారం భార్య, పిల్లలు మాత్రమే కుటుంబంలో భాగమని కోర్టు గుర్తించింది. ధర్మాసనం పరిశీలించిన దాని ప్రకారం.. వివాహేతర సంబంధం ఆధారంగా భార్యపై న్యాయపరంగా విడాకులు మంజూరైతే, ఆమె వివాహేతర సంబంధానికి పాల్పడినట్లు రుజువైతేనే ఆమెకు పింఛను ప్రయోజనాలను నిరాకరించవచ్చు.
కానీ ఈ కేసులో విడాకుల కేసు కొనసాగుతోంది. అలాగే ఆరోపణలు విచారణలో ఉండగానే ఆ భర్త మరణించారు. అందువల్ల భార్యపై చేసిన ఆరోపణలకు ఎలాంటి న్యాయపరమైన తీర్పు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే భార్యా, పిల్లలకే పింఛన్, ఇతర ప్రయోజనాలు అందజేయాలని కోర్టు తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఎనిమిది వారాల్లో బకాయిలు విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. లేకపోతే సంవత్సరానికి 9 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నెలవారీ కుటుంబ పింఛనును వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa