ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థిరపడిన భార్యకు భరణం ఇవ్వవలసిన అవసరంలేదు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 05:13 PM

భరణం కేసులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ఆర్థికంగా స్వతంత్రంగా, మంచి ఉద్యోగంలో స్థిరపడిన భార్యకు భర్త నుంచి శాశ్వత భరణం పొందే హక్కు లేదని స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం భరణం అనేది అవసరంలో ఉన్నవారికి అందించే ఒక సామాజిక న్యాయమని, అంతేకానీ ఆర్థికంగా సమాన స్థాయికి రావడానికి లేదా మరింత సుసంపన్నం కావడానికి కాదని తేల్చి చెప్పింది.ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భర్త ఒక న్యాయవాది కాగా, భార్య ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టీఎస్)లో గ్రూప్-ఏ అధికారిణి. వీరికి 2010 జనవరిలో వివాహం కాగా, కేవలం 14 నెలల్లోనే విడిపోయారు.తన భార్య తనను మానసికంగా, శారీరకంగా హింసించిందని, దూషణలతో కూడిన సందేశాలు పంపుతూ, సామాజికంగా అవమానించిందని ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ ఆరోపణలను భార్య ఖండించింది. విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు, భర్తపై భార్య క్రూరంగా ప్రవర్తించిందని నిర్ధారించి విడాకులు మంజూరు చేసింది. విడాకులకు అంగీకరించాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసినట్లు సాక్ష్యాధారాల ద్వారా రుజువైందని కోర్టు పేర్కొంది.ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం కింది కోర్టు తీర్పును సమర్థించింది. భార్యకు మంచి జీతంతో కూడిన ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం ఉందని, ఆమె ఆర్థికంగా పూర్తిగా స్వతంత్రంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వీరిద్దరూ కలిసి జీవించింది కొద్ది కాలమేనని, వారికి పిల్లలు కూడా లేరని గుర్తు చేసింది. ఆర్థికంగా అవసరం ఉందని నిరూపించే ఎలాంటి ఆధారాలు లేనందున, శాశ్వత భరణం కోరడాన్ని తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. భర్తను, అతని తల్లిని దూషిస్తూ, అతను అక్రమ సంతానం అని నిందించడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని కోర్టు పేర్కొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa