ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా మూడోరోజు కంపించిన భూమి,,,పాకిస్థాన్‌ను కుదిపేస్తున్న వరుస భూకంపాలు

international |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 07:32 PM

దాయాది దేశం పాకిస్థాన్‌ను పక్క దేశాలతో పాటు ప్రకృతి విపత్తులు కూడా భయపెడుతున్నాయి. నిన్నటి వరకు ఆఫ్గనిస్థాన్‌తో ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చవి చూసిన పాక్ మీద ఇప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసింది. వరుస భూకంపాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. దీంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. శని, ఆది వారాలతో పాటుగా సోమవారం ఉదయం 11.12 గంటల సమయంలో పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఆ వివరాలు..


పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 4.7గా నమోదయ్యింది. భూకంప తీవ్రతకు చాలా చోట్ల ఇళ్లు దెబ్బ తిన్నాయి. జనాలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పాక్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయని.. స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. భూకంప ధాటికి ఆస్తి నష్టం సంభవించిందని సమాచారం.


భారత కాలమానం ప్రకారం చూసుకుంటే.. సోమవారం ఉదయం 11.12 గంటలకు పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అయితే దీని కన్నా ముందు శని, ఆదివారాల్లో కూడా పాకిస్థాన్‌లో 4.0 తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయని తెలిసింది. పాకిస్థాన్‌లో సోమవారం సంభవించిన భూకంపం గురించి ఎన్‌సీఎస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో దీని గురించి తెలిసింది.


పాకిస్థాన్‌లో సోమవారం సంభవించిన భూకంప తాకిడికి సంబంధించిన సమాచారానికి వస్తే.. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదికల ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 4.7గా నమోదైనట్లు ఎన్‌సీఎస్ అధికారులు తెలిపారు. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించారు.ఉపరితల భూకంపాలు ప్రమాదకరమైనవిగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణించినప్పటికీ.. బలమైన ప్రకంపన వల్ల ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు.


పాకిస్థాన్ భూకంపపరంగా చురుకైన ప్రాంతంలో ఉంది అని నిపుణులు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, బలూచిస్తాన్ వంటి ప్రాంతాలు.. యురేషియన్ బెల్ట్ దక్షిణ అంచున ఉండటంతో.. ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవించేందుకు అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అలానే భారత బెల్ట్ వాయువ్య అంచున సింధ్, పంజాబ్ ప్రాంతాలున్నాయి. ఈ క్రమంలోనే పాక్‌లోని అనేక ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయని అధికారులు తెలిపారు.


స్వాతంత్య్రానికి పూర్వం అనగా 1945లో బలూచిస్థాన్‌లో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపంతో అతి ప్రమాదకరమైనదిగా నిలిచింది. సింధ్ ప్రాంతంలోతక్కవు తీవ్రతతో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయని.. అయితే వీటిని సురక్షితమైనవిగా పరిగణించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంత పరిధిలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సన్నాహాలు పూర్తి చేయాలని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa