ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు.. మండిపడుతున్న భారత నెటిజన్లు

international |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 07:34 PM

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సోమవారం దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. దీపావళి పండగ సందర్భంగా ఎక్స్ వేదికగా షెహబాజ్ షరీఫ్.. తన పండగ సందేశాన్ని షేర్ చేశారు. అయితే పాకిస్తాన్‌లోని మైనారిటీలు, మరీ ముఖ్యంగా హిందువులపై దాడులు జరుగుతున్న వేళ.. షెహబాజ్ షరీఫ్ ఇలాంటి శుభాకాంక్షలు చెప్పడం పట్ల భారత నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. షెహబాజ్ షరీఫ్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అంటూ విమర్శలు చేస్తున్నారు.


దీపావళి పండగ వెలుగులతో ఇళ్లు, హృదయాలు ప్రకాశిస్తున్నందున.. ఈ పండుగ అంధకారాన్ని తొలగించి.. సామరస్యాన్ని పెంచి.. శాంతి, కరుణ, ఉమ్మడి శ్రేయస్సు వైపు మనందరినీ నడిపించాలని షెహబాజ్ షరీఫ్ ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందేశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఈ పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి, నిరాశపై ఆశ విజయాన్ని సూచిస్తుందని పాక్ ప్రధాని తెలిపారు. అసహనం, అసమానత వంటి సామాజిక సవాళ్లను అధిగమించడానికి ఈ స్ఫూర్తి మనందరికీ ప్రేరణగా నిలవాలని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అన్ని మతాలు, నేపథ్యాల ప్రజలు శాంతితో జీవించడానికి, దేశ పురోగతికి దోహదపడేలా అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పాక్ ప్రధాని పిలుపునిచ్చారు.


బిలావల్ భుట్టో శుభాకాంక్షలు


పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా హిందూ సమాజానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని వెలుగుల, ఆశ, పునరుద్ధరణ పండుగగా ఆయన అభివర్ణించారు. దీపావళి వెలుగు ఎల్లప్పుడూ చీకటిపై విజయం సాధిస్తుందని.. బిలావల్ హౌస్ మీడియా సెల్ విడుదల చేసిన పత్రికా ప్రకటన విడుదల చేసింది.


ద్వేషం, విభజనపై నిజం, శాంతి, ప్రేమ ప్రబలాలని మనకు గుర్తుచేస్తుందని బిలావల్ భుట్టో పేర్కొన్నారు. పాకిస్థాన్ సమాజంలో హిందువులు అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఉన్నందున.. ఆ దేశ నాయకుల ఇలా దీపావళి శుభాకాంక్షలు చెప్పడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


అయితే పాకిస్తాన్‌లో నిత్యం మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో గుళ్లు, మతపరమైన ప్రార్థనా మందిరాలు ధ్వంసం అవుతూనే ఉంటాయి. పాకిస్తాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింసపై భారత్ సహా పలు దేశాలు అంతర్జాతీయ వేదికపై పదే పదే ప్రస్తావిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని దీపావళి శుభాకాంక్షలు చెప్పడం పట్ల తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa