నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మంగళవారం వివరాలు వెల్లడించారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బుధవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారనుందని తెలిపారు. ఆ తర్వాత 24 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.వాయుగుండం ప్రభావంతో బుధవారం నాడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఇక గురువారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని అన్నారు.వాతావరణ మార్పుల నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ఆయన గట్టిగా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa