కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతులకు నిజమైన న్యాయం జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.సుమారు రూ.12,200 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని, 16,700 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 6 కోట్ల గోతాలను అందుబాటులో ఉంచామన్నారు.గత ప్రభుత్వం రైతులకు రూ.1,670 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని, ధాన్యం డబ్బులను 6 నుంచి 9 నెలల వరకు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అయితే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 87 శాతం ధాన్యం డబ్బులను కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తుచేశారు. ఈసారి ఆ సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. తేమ శాతం కొలతలో పారదర్శకత కోసం ఒకే కంపెనీకి చెందిన యంత్రాలను వాడతామని, అవసరమైతే బ్లూటూత్ ద్వారా రీడింగ్ తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాట్సాప్లో "HI" అని మెసేజ్ చేయడం ద్వారా రైతులు తమ ధాన్యం అమ్మకం షెడ్యూల్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించామన్నారు.జనవరి నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కిలో గోధుమపిండిని రూ.18కే అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఇందుకోసం 2,400 మెట్రిక్ టన్నుల గోధుమపిండిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ మాసంలో వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు 50 వేల టార్పాలిన్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.ఈ-క్రాప్లో పంట నష్టాన్ని నమోదు చేస్తే ప్రభుత్వం ధాన్యం కొనదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఎవరూ నమ్మవద్దని మంత్రి కోరారు. ఈ-క్రాప్లో నమోదైన ప్రతి గింజనూ నూటికి నూరు శాతం కొనుగోలు చేసి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 39.51 లక్షల ఎకరాల్లో ఈ-క్రాప్ నమోదు పూర్తయిందని, 85 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ వైస్ చైర్మన్-ఎండీ ఢిల్లీ రావు, డైరెక్టర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa