అహంకారం కలిగిన ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. అలాంటి ఏ రాజకీయ శక్తినైనా మేం ప్రతిఘటిస్తాం అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ లక్ష్యం తమిళనాడు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో స్టాలిన్ పైవిధంగా మాట్లాడారు.తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన పార్టీ యూత్ వింగ్ నార్త్ జోన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమిత్ షా లేదా సంఘ పరివార్ తమిళనాడులో విజయం సాధించలేరని అన్నారు. బీజేపీ తమిళ ప్రజల ఆలోచనను ఎప్పటికీ అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. ప్రేమతో మా వద్దకు వస్తే ఆలింగనం చేసుకుంటామని, అహంకారంతో వస్తే మాత్రం తలవంచే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీని నేరుగా ఎదుర్కొని ఓడిస్తామని వ్యాఖ్యానించారు.బీజేపీ వరుసగా మూడవసారి జాతీయస్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మితవాద శక్తులు దూకుడుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ శక్తులు ప్రజలను మోసం చేయడానికి తియ్యని అబద్ధాలు చెబుతున్నాయని విమర్శించారు. అలాంటి వారితో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీజేపీ ఎప్పటికీ తమిళనాడులో గెలవదని స్టాలిన్ అన్నారు. అందుకే అమిత్ షా చిరాకు పడుతున్నారని పేర్కొన్నారు.తమిళ భాషను, ప్రజలను రక్షించడంతో పాటు భారతదేశ వైవిధ్య, సమాఖ్య విలువలను కాపాడటం కూడా డీఎంకే బాధ్యత అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక యుద్ధం చేస్తున్న ఏకైక ప్రాంతీయ పార్టీ డీఎంకే మాత్రమే అన్నారు. గెలవడానికి ఇది బీహార్ కాదని, తమిళనాడు అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa