కోస్తాంధ్ర, తమిళనాడు మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. నరసాపురం-చెన్నై మధ్య ప్రతిష్ఠాత్మక వందేభారత్ ఎక్స్ప్రెస్ సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. నరసాపురం రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ఈ రైలుకు పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, స్థానిక జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.ఇప్పటివరకు చెన్నై సెంట్రల్-విజయవాడ మధ్య నడుస్తున్న ఈ సెమీ-హైస్పీడ్ రైలును గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ రైలు, డిసెంబర్ 17 నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మంగళవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది.ఈ రైలు నరసాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి, రాత్రి 11:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నైలో ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపురం వస్తుంది. మొత్తం 655 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 9 గంటల్లో పూర్తి చేస్తుంది. ఈ రైలు భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్లలో ఆగుతుంది.ఈ రైలులో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1,635 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,030గా అధికారులు నిర్ణయించారు. ఈ కొత్త సర్వీసుతో వాణిజ్య, వ్యాపార, పర్యాటక ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa