ట్రెండింగ్
Epaper    English    தமிழ்

112 రోజుల తర్వాత.... ఐపీఎస్ అధికారి సంజయ్‌కు బెయిల్ మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 07:42 PM

ఐపీఎస్‌ అధికారి సంజయ్‌‌కు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్ లభించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుమారుగా 112 రోజులుగా రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే పలుసార్లు సంజయ్ బెయిల్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు సంజయ్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు సోమవారం రోజున సంజయ్‌కు బెయిల్ ఇచ్చింది విజయవాడ ఏసీబీ కోర్టు.


మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐపీఎస్ అధికారి సంజయ్.. అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేశారు. అయితే ఆ సమయంలో సంజయ్ అక్రమాలకు పాల్పడ్డారని..ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు వచ్చాయి. ఈ అభియోగాల నేపథ్యంలో ఐపీఎస్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం అరెస్ట్ చేయగా.. విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు.


అగ్నిమాపక శాఖ డీజీగా, సీఐడీ ఏడీజీగా పనిచేసిన సమయంలో హోదాను ఉపయోగించి రూ.1.75 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారంటూ ఐపీఎస్ అధికారి సంజయ్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, ట్యాబ్‌ల సరఫరా ఒప్పందం పేరుతో సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా అనే సంస్థకు... ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ ఒప్పందమంటూ క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థకు రూ.1.75 కోట్లు ప్రభుత్వ ధనాన్ని సంజయ్‌ దోచిపెట్టారంటూ వచ్చిన అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ సంజయ్‌ను అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో మూడుసార్లు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు డిస్మిస్ చేసింది. చివరకు సోమవారం రోజున సంజయ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa